అవిశ్వాసంపై మోత్కుపల్లి ట్విస్ట్: మైక్ విసిరిన బాలినేని
బాబు వచ్చే వరకు ఆగరా?
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజల్లో ఉన్నారని, ఆయన వచ్చాక అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారని, నిజంగానే ప్రభుత్వాన్ని కూల్చాలని ఉంటే అప్పటి వరకు ఆగలేరా అని వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలను మోత్కుపల్లి ప్రశ్నించారు.
వైయస్ జగన్కు ఇంద్ర భవనం ఎక్కడిది?
వైయస్ జగన్మోహన్ రెడ్డికి లోటస్ పాండులో ఇంద్ర భవనం ఎలా వచ్చిందని మోత్కుపల్లి ప్రశ్నించారు. జగన్ డెబ్బై గదులు, పది అత్యాధునిక లిఫ్ట్లతో ఇంటిని ఎవరి డబ్బుతో నిర్మించుకున్నారని ప్రశ్నించారు. లక్ష కోట్లు దోచుకున్న వారిని ఏమీ అనకుండా ఊరుకోవాలా అని ప్రశ్నించారు. అమర్యాదగా మాట్లాడటం వారికి తప్ప తమకు తెలియదన్నారు. ప్రజల పక్షాన పోరాడటమే తమకు తెలుసునని చెప్పారు.
అవిశ్వాసం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించి తమపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వారి గురించి వీరి గురించి మాట్లాడవద్దని చెబుతున్నారని, వైయస్, రోశయ్య, కిరణ్లలో ఎవరి గురించి మాట్లాడాలో చెప్పాలని ఎద్దేవా చేశారు. భారత దేశంలో ఎవరికీ లేని అందమైన భవనం జగన్ కట్టుకున్నారన్నారు. బాబు పాదయాత్ర పూర్తయిన తర్వాత అవిశ్వాసం పెడతామన్నారు. కాంగ్రెసు వల్లే కరెంటు కష్టాలన్నారు.
నీతి, నిజాయితీలపై నిలబడే వ్యక్తి చంద్రబాబు అన్నారు. కాంగ్రెసు హయాంలో పేదవాడు బాగుపడలేదన్నారు. వైయస్ హయాంలో ఆయన కుటుంబమే బాగుపడిందన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరవై మంది ఎమ్మెల్యేలు బాగుపడ్డారన్నారు. తన భర్త మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన విజయమ్మ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు ఓటు వేశారన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి జగన్ పార్టీ అధికారంలోకి రావాలని చూస్తోందని మండిపడ్డారు.
మైక్ విసిరేకిన బాలినేని
వైయస్ పైన మోత్కుపల్లి విమర్శలు గుప్పిస్తుండగా.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక్కసారిగా మైక్ విసిరేశారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసిపి నేతలు మైకులు, హెడ్ ఫోన్స్ విసిరేస్తూ మీదకు వచ్చారని, దళిత నేతకు అలా విసిరేసినందుకు ఆ పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలని సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. వారు క్షమాపణలు చెప్పిన తర్వాతే అవకాశమివ్వాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
నాగంకు స్వల్ప అస్వస్థత
తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వారి వద్ద విషయం ఉంది: శ్రీధర్ బాబు
తమపై అవిశ్వాసం పెట్టిన వారి వద్ద విషయం ఉందని తాము భావిస్తున్నామని, వారికి సమాధానం చెప్పేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.