గాలితో లింక్: గుర్నాథ్ రెడ్డికి పయ్యావుల సవాల్
ఒక హోటల్లో జరిగిన శుభాకార్యంలో గాలి జనార్దన్ రెడ్డి తనకు తారసపడినప్పుడు నమస్కారం చేస్తే తాను ప్రతి నమస్కారం చేశానని, దాన్ని భూతద్దంలో చూపుతూ అసత్య ఆరోపణలకు దిగారని ఆయన అన్నారు. గాలి జనార్దన్ రెడ్డితో తనకు ఏ విధమైన సంబంధాలు కూడా లేవని, వ్యాపార సంబంధాలు కూడా లేవని ఆయన స్పష్టం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి నుంచి తనకు ముడుపులు అందాయనే విషయంపై తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని, గుర్నాథ్ రెడ్డి అందుకు సిద్ధపడుతారా అని ఆయన అడిగారు.
బళ్లారి నుంచి 2009 ఎన్నికల్లో డబ్బులు తరలిస్తున్నారనే విషయంపై తాను డిజిపికి ఫిర్యాదు చేశానని, గాలి జనార్దన్ రెడ్డి నుంచి ప్రభుత్వానికి డబ్బులు ముట్టాయని తాను కొత్తగా అనడం లేదని, ఆ రోజే చెప్పానని, పోలీసుల సహకారంతో డబ్బులు తరలిస్తున్నారని తాను డిజిపి ఫిర్యాదు చేశానని ఆయన అన్నారు. అవిశ్వాసంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన గుర్నాథ్ రెడ్డికి ప్రభుత్వ విచారణపై నమ్మకం లేకపోతే కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
తనపై గుర్నాథ్ రెడ్డి చేసిన ఆరోపణలపై తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని, తనపై చేసిన ఆరోపణల మీద విచారణ జరిపించాలని తానే ప్రభుత్వానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఆయన అన్నారు. శాసనసభా సమావేశాల నిర్వహణపై, ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. అన్ని పార్టీల శానససభా పక్ష నేతలను సమన్వయ పరచడంలో స్పీకర్ విఫలమవుతున్నారని ఆయన విమర్శించారు.