జూ. ఎన్టీఆర్ బాద్షా ఆడియో ఫంక్షన్లో ఫ్యాన్ మృతి
హైదరాబాద్ : జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' ఆడియో వేడుకల్లో ఆపశృతి చోటు చేసుకుంది. ఆదివారం నాడు మణికొండలోని రామానాయుడు స్టూడియోలో ఈ వేడుకలు ఏర్పాటయ్యాయి. ఈ వేడులకు జూ. ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఈ ఘటనలో వరంగల్లోని ఉరుసుగుట్టకు చెందిన రాజు అనే అభిమాని ఊపిరి ఆడక మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. మృతదేహాన్ని కొండాపూర్ ఆస్పత్రిలో ఉంచారు.
'బాద్ షా' ఆడియో వేడుకల్లో తొక్కిసలాట జరిగి, అభిమాని మృతి చెందడంతో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేనిది ఈసారి ఇలా ఎందుకు జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో వరంగల్ జిల్లాకు చెందిన రాజు అనే అభిమాని మృతి చెందడంతో తోటి అభిమానులు ఆయన మృతికి సంతాపంగా రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు.
నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. బండ్ల గణేష్ నిర్మాత. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు.
తెలంగాణ రాములమ్మ ఫైర్
జూనియర్ ఎన్టీఆర్ బాద్షా సినిమాను తెలంగాణలో బహిష్కరిస్తామని తెలంగాణ రాములమ్మ విజయశాంతి హెచ్చరించారు. బాద్షా సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో రాజు అనే వరంగల్ యువకుడు మృతి చెందడంపై ఆమె నిర్వాహకుల మీద మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆమె ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సీమాంధ్ర దురహంకారానికి నిరసనగా బాద్షా సినిమాను తెలంగాణలో బహిష్కరిస్తామని ఆమె చెప్పారు. ఒక తెలంగాణ యువకుడు ఆడియో విడుదల కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో మరణిస్తే కనీసం సంతాపం కూడా ప్రకటించకుండా కార్యక్రమాన్ని కొనసాగించడం సీమాంధ్ర దురహంకారానికి నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి వ్యాఖ్యానించారు.
మృతుని కుటుంబానికి నష్టపరిహారం
మృతుడు రాజు కుటుంబానికి ఐదు లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించారు.
కాజల్ గైర్హాజర్ గైర్హాజర్
బాద్షా ఆడియో విడుదల కార్యక్రమానికి తాను హజారు కాలేకపోతున్నట్లు హీరోయన్ కాజల్ తెలిపింది. మీడియా వెబ్సైట్లో ఆమె ఈ విషయం చెప్పింది. కోయంబత్తూరు విమానాశ్రయ అధికారులు తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె విమర్శించింది. తనకు బోర్డింగ్ పాస్ ఉన్నా అనుమతించకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. కేరళలోని పొలాచీలో షూటింగులో పాల్గొన్న ఆమె బాద్షా ఆడియో కార్యక్రమానికి రావడానికి కోయంబత్తూరు విమానాశ్రయం చేరుకుంది. అయితే, తనను అనుమతించకపోవడంతో ఆమె రాలేకపోయింది.