వైయస్పై చంద్రబాబు పిట్ట కథ: బిగ్గరగా నవ్విన వైనం
ఓ కార్యకర్తతో మాట్లాడుతూ.. ఏం తిన్నావని చంద్రబాబు అడిగారు. టిఫిన్ చేశానని, ఆ తర్వాత మందేశానని చెప్పాడు. ఆయన వ్యాఖ్యలతో బాబు ఒక్కసారిగా నవ్వేశారు. ఆ తర్వాత బెల్టు షాపు ఎత్తేస్తే మందు మానేస్తావా అని బాబు అతనిని అడిగాడు. అందుకు అతను మీపైన ఒట్టు మానేస్తానని బాబుతో అన్నాడు. అందుకు బాబు నామీదే ఒట్టేస్తున్నావా... అధికారంలోకి రాగానే రెండో సంతకం ఆ ఫైలు మీదే పెడతానని మరోసారి బిగ్గరగా నవ్వారు.
శనివారం పాదయాత్ర ఆసాంతం ఆయన చలోక్తులు, వ్యంగ్య వ్యాఖ్యలు, పిట్టకథలతో అలరించారు. "అనగనగా ఒక వేటగాడు పక్షుల కోసం వల విసిరాడు. వల లోపల గింజలు విసిరాడు. ఏమీ తెలియని పక్షులు గింజలకు ఆశపడి వలలో పడ్డాయి. ఇంకేముంది వేటగాడు అమ్మో ఎన్ని పిట్టలుపడ్డాయో అంటూ తెగమురిసిపోయాడు. ఈలోపే వలలో పడ్డ పక్షులు ఒకదానితో ఒకటి మాట్లాడుకున్నాయి. వీడి సంగతి చూడాలని ఓ లెక్కకు వచ్చాయి. అంతే రెక్కల్లో శక్తి తెచ్చుకుని వలతో సహా ఆకాశానికి ఎగిరిపోయాయి! వైయస్ కూడా ఇలాగే పథకాల గింజలు విసిరి, ప్రజలను వలలో వేసుకుని, నిండా ముంచాడు'' అని తెలిపారు.
పిట్టకథలోని పక్షుల్లాగానే ప్రజలంతా చైతన్యవంతులు కావాలని సూచించారు. ఒక రాజు దగ్గరకు ఓ అత్యాశపరుడు వచ్చాడు. భూమి కావాలన్నాడు. 'నీకెంత భూమికావాలో తీసుకో. నువ్వు పొద్దున్నుంచి రాత్రి వరకు ఎంత తిరిగితే అంత భూమి నీదే' అని హామీ ఇచ్చాడు. ఆశపరుడైన ఆ వ్యక్తి ఉదయం నుంచి రాత్రి వరకు పరిగెత్తి పరిగెత్తి తిరిగాడు. ఆ తర్వాత గుండెనొప్పి వచ్చి పైకి పోయాడు. అత్యాశకు పోతే మిగిలేది ఆరు అడుగుల నేలే! వైయస్ హయాంలో వేల ఎకరాలు ఇలాగే తన్నుకుపోయారు. చివరకు జైళ్ల పాలయ్యారు.