బాక్సైట్ మైనింగ్పై కేంద్రమంత్రుల వ్యాఖ్య: కిరణ్ హామీ!
బహిరంగ సభలో కేంద్ర మంత్రులు జైరాం రమేశ్, కిశోర్ చంద్రదేవ్ మాట్లాడుతూ... బాక్సైట్ తవ్వకాలకు తాము పూర్తి వ్యతిరేకమని, కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన ఎంవోయూలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రద్దు చేయాలంటూ సభాముఖంగా వేదికపై నున్న ముఖ్యమంత్రిని ఉద్దేశించి చెప్పారు. సభలో తొలుత కిశోర్ చంద్రదేవ్ మాట్లాడుతూ, గత ఫిబ్రవరి 4న ప్రధానమంత్రి నేతృత్వంలో ఏడుగురు కేంద్ర మంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్యాంగంలోని 244 షెడ్యూల్ ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాలకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
రాజ్యాంగ విరుద్ధంగా, అటవీ చట్టాలను తుంగలోకి తొక్కుతూ బాక్సైట్ తవ్వకాలకు కుదుర్చుకున్న ఎంవోయులను రద్దు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇక బాక్సైట్ తవ్వకాలపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, ఆ ఆలోచనను గిరిజనుల మనసులోంచి తొలగించవచ్చునని స్పష్టం చేశారు. జైరాం రమేశ్ మాట్లాడుతూ... తాను, కిశోర్ చంద్రదేవ్, రాష్ట్ర మంత్రి బాలరాజు కూడా నిర్దిష్టంగా, బహిరంగంగా బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నామని, తీవ్రవాదాన్ని అణచి వేయాలంటే మైనింగ్ కార్యకలాపాలను నిలిపి వేయాల్సిందేనని, విశాఖ ఏజెన్సీలో ఖనిజ తవ్వకాలను 20 ఏళ్లపాటు నిషేధించాలని, ఈ మేరకు మారటోరియం విధించాలని సభలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఖనిజ తవ్వకాల ద్వారా దేశంలో ఏ ప్రాంతంలోనూ గిరిజనులు లబ్ధి పొందలేదని, ఇతర ప్రాంతాల వ్యాపారులు మరింత ధనవంతులు కావడమే తప్ప స్థానిక ప్రజానీకానికి మైనింగ్ ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పారు. మావోయిస్టు ఉద్యమాన్ని అణచి వేయడంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనింగ్ విషయంలో కూడా అదే బాటను అనుసరించాలని కోరారు. ఆ తర్వాత కిరణ్ మాట్లాడారు.
బాక్సైట్ తవ్వకాల విషయంలో రాజ్యాంగ నిబంధనలను, చట్టాలను తమ ప్రభుత్వం ఉల్లంఘించదని గిరిజనులకు హామీ ఇచ్చారు. చట్ట పరిధిలో ఉంటేనే బాక్సైట్ తవ్వకాలు జరుగుతాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని, చట్టాలను తుంగలోకి తొక్కి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ నిక్షేపాలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో కిరణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.