జూ. ఎన్టీఆర్ ఫ్యాన్ మృతి: ముదురుతున్న వివాదం
రచయిత కోన వెంకట్ వ్యాఖ్యలు వివాదం ముదరడానికి కారణమయ్యాయనే మాట వినిపిస్తోంది. పోలీసుల అత్యుత్సాహం వల్లనే తొక్కిసలాట జరిగిందని కోన వెంకట్ ఆరోపించారు. పోలీసులు లాఠీచార్జీ చేయడం వల్లనే తొక్కిసలాట జరిగి రాజు మరణించాడని ఆయన ఆరోపించారు. సంఘటనపై హీరో జూనియర్ ఎన్టీఆర్, నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు శ్రీను వైట్ల తీవ్రంగా కలత చెందినట్లు చెబుతూనే ఆయన పోలీసులపై విరుచుకుపడ్డారు.
అయితే పోలీసుల వాదన మరో రకంగా ఉంది. బాద్షా సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సందర్భందా జరిగిన తొక్కిసలాటలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతికి పోలీసులు నిర్వాహకులను తప్పు పడుతున్నారు. కార్యక్రమ నిర్వహణకు ఆ వేదిక వద్దని తాము చెప్పినా సినియా యూనిట్ వినలేదని పోలీసులు అంటున్నారు. పెద్ద యెత్తున వచ్చే అభిమానులను కట్టడి చేయడం ఈ వేదిక వద్ద కుదరదని తాము చెప్పినా వారు వినలేదని మాదాపూర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ టి. యోగానంద్ మీడియా ప్రతినిధులతో అన్నారు.
సంఘటనకు సంబంధించి పోలీసులు నిర్మాత బండ్ల గణేష్పైనే కాకుండా ఏమీ జరగకుండా చేస్తామని తమకు హామీ ఇచ్చిన విజయ్పై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కార్యక్రమానికి 15 వేల మందిని ఆహ్వానించగా, కలర్ జీరాక్స్ తీసుకుని 25 వేల మంది వచ్చారని, దీంతో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగిందనే మాట వినిపిస్తోంది.
అభిమానులను తగిన రీతిలో కట్టడి చేయడానికి తమ వాలంటీర్లు ఉన్నారని, తాము పరిస్థితిని అదుపు చేయగలమని, తమకు అక్కడే అనుమతి ఇవ్వాలని సినిమా యూనిట్ తరఫున విజయ్ అనే వ్యక్తి పోలీసులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ తీరుపై విమర్శలు వస్తుండడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' ఆడియో వేడుకల్లో ఆపశృతి చోటు చేసుకుంది. ఆదివారం నాడు మణికొండలోని రామానాయుడు స్టూడియోలో ఈ వేడుకలు ఏర్పాటయ్యాయి. ఈ వేడులకు జూ. ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో వరంగల్లోని ఉరుసుగుట్టకు చెందిన రాజు అనే అభిమాని ఊపిరి ఆడక మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. మృతదేహాన్ని కొండాపూర్ ఆస్పత్రిలో ఉంచారు.