కౌన్ కిస్ కా? రెచ్చగొడ్తున్నారు: బేణి వర్సెస్ ములాయం
సభలో బేణి ప్రసాద్ వర్మ మాట్లాడుతూ.. 2002 అల్లర్ల తర్వాత గుజరాత్లో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు సమాజ్వాది పార్టీ పరోక్షంగా సహకరించిందని ఆరోపించారు. అల్లర్ల అనంతరం జరిగిన 2002 ఎన్నికల్లో ఎస్పీ గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా నరేంద్ర మోడి అధికారంలోకి వచ్చేందుకు పరోక్షంగా సహకరించారని అభిప్రాయపడ్డారు.
ఆయన వ్యాఖ్యల పైన తీవ్రంగా మండిపడ్డ ఎస్పీ ఎంపీలు బేణి ప్రసాద్ను తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆయనను మంత్రి వర్గం నుండి తొలగించాలని లోకసభ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన బేణి ప్రసాద్ వర్మ.. తనను మంత్రివర్గం నుండి తొలగించమని చెప్పేందుకు ములాయం ఎవరని ప్రశ్నించారు.
ములాయం తనను ఏమైనా మంత్రిగా చేశారా అని ధ్వజమెత్తారు. జాతిని మోసం చేసినందుకు ములాయం క్షమాపణలు చెప్పాలని బేణి డిమాండ్ చేశారు. తన ఉద్దేశ్యం మేరకు తీవ్రవాదానికి మతం, రంగు ఉండదని, బాబ్లీ మసీదు కూల్చివేత, గోద్రా అనంతర ఘటనలు కూడా తీవ్రవాద కలాపాలే అన్నారు. ఓ సమయంలో కౌన్ కిస్కా అంటూ మండిపడ్డారు. ములాయం తీవ్రవాదాన్ని రెచ్చగొడుతున్నారన్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేతకు కారణమైన కల్యాణ్ సింగ్తో ములాయం కలిశారని, బిజెపి గుజరాత్లో అధికారంలోకి వచ్చేందుకు సహకరించారని ఆరోపించారు. ములాయంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఎస్పీ డిమాండ్ చేసింది. అయితే, తాను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని బేణి ఖరాఖండిగా చెప్పారు. సభలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో దద్దరిల్లిపోయింది.