తమిళ్ ఎఫెక్ట్: ఐపిఎల్లో చెన్నైలో లంక ఆటగాళ్లు డౌట్
ఐపిఎల్ 6లో శ్రీలంక ఆటగాళ్లు చెన్నైలో ఆడక పోవచ్చునని బిసిసిఐ చెప్పినట్లుగా తెలుస్తోంది. లంక ఆటగాళ్లు చెన్నైలో ఆడితే సరైన భద్రత ఉండకపోవచ్చునని బిసిసిఐ అనుమానిస్తోందని సమాచారం. దీంతో, ఐపిఎల్-6 చెన్నైలో జరగక పోవడమో లేక చెన్నైలో జరిగే మ్యాచులలో శ్రీలంక ఆటగాళ్లు ఆడక పోవడమే జరిగే అవకాశాలు ఉన్నాయి.
శ్రీలంకకు చెందిన ఓ బౌద్ద భిక్షువుపై తమిళనాడులో దాడి జరిగింది. శ్రీలంకకు చెందిన ముప్పై మూడేళ్ల బండారా రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకొని సోమవారం చెన్నై రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆయనపై దాడికి పాల్పడ్డారు.
వారి నుంచి తప్పించుకొని దాడి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన బౌద్ధ భిక్షువులపై గత మూడు రోజుల్లో రెండు దాడులు జరిగాయి. తమిళులపై శ్రీలంక ప్రభుత్వం చర్యలు నిరసిస్తూ ఈ దాడులు జరుగుతున్నాయి.