కరుణ ఎఫెక్ట్: ములాయంకు సారీ, సోనియా బుజ్జగింపు
ప్రధానమంత్రి తన రాజీనామాను అడగలేదని ఆయన చెప్పారు. ప్రధానితో వర్మ భేటీ అయిన సమయంలో ఆయన రాజీనామాను ప్రధాని కోరుతున్నట్లుగా ప్రచారం జరిగింది. దీనిని బేణి ఖండించారు. మంగళవారం ములాయం సింగ్ పైన బేణి ప్రసాద్ వర్మ తీవ్రవాద సంబంధ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎస్పీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం కూడా ఎస్పీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.
బేణి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్పీ సభ్యులకు ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు పలికింది. బేణి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. బేణి వ్యాఖ్యలను లాలూ ప్రసాద్ యాదవ్ తప్పు పట్టారు. ఆయనను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం బేణి ప్రసాద్ వర్మ.. ములాయంకు క్షమాపణలు చెప్పారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సభలో ములాయం సింగ్ వద్దకు వెళ్లి బేణి వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చారు. ఆయనను బుజ్జగించారు. డిఎంకె ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో ములాయం అసంతృప్తికి గురైతే మరిన్ని చిక్కులు వస్తాయని భావించిన సోనియా ఈ వివాదానికి తెర దించే ప్రయత్నాలు చేశారు. బేణి వ్యాఖ్యలతో కాంగ్రెసుకు సంబంధం లేదని ఆమె ములాయంకు నచ్చజెప్పారు.
డిఎంకేకు చెందిన ఐదుగురు పార్టీ ఎంపీలు ఈ రోజు మధ్యాహ్నం రాజీనామా చేశారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు కరుణానిధి నిన్ననే ప్రకటించారు. ప్రస్తుతం కేంద్రం ఎస్పీ, బిఎస్పీల మద్దతుతో గట్టెక్కింది. అదే ఎస్పీ చీఫ్ ములాయం పైన బేణీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరుణానిధి బయటకు వెళ్లిన ఈ సమయంలో ములాయంను అసంతృప్తికి గురి చేస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించిన కాంగ్రెసు ఆయనను బుజ్జగించింది. బేణితో క్షమాపణలు చెప్పించింది.