షాక్: జగన్పార్టీలోకి తెలంగాణ ఎమ్మెల్యే కూన, మరొకరు
కాంగ్రెసు పార్టీకి మద్దతిస్తున్న స్వతంత్ర సభ్యుడు కూన శ్రీశైలం గౌడ్తో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా జగన్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందనే ప్రచారం సాగుతోంది. కూనతో పాటు మరో ఎమ్మెల్యే తమ పార్టీలోకి వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుసగుసలాడుకుంటోందట.
వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ మొదటి నుండి జగన్కు మద్దతు పలుకుతున్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నుండి జగన్ వైపు పలువురు నేతలు వెళ్తున్నా ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు సీమాంధ్ర నుండే వెళ్లారు. ఒక్క సురేఖ తప్ప. తెలంగాణ ప్రాంతం కొండా సురేఖ తర్వాత ఎమ్మెల్యేలు వెళ్లలేదు. ఇప్పుడు కూనతో పాటు మరో అధికార పార్టీ ఎమ్మెల్యే వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం గుప్పుమంటోంది.
కుత్బుల్లాపూర్ నుండి స్వతంత్ర శాసనసభ్యుడుగా గెలుపొందిన కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెసు అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన శుక్రవారం ఉదయం అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అండతో అప్పుడు శ్రీశైలం గెలుపొందారు. అతను జగన్ వైపు వెళ్తారని మొదటి నుండి ప్రచారం సాగుతోంది. ఇప్పుడు అతను జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధపడ్డారు.