మీ జాగీరా?: సభలో ఎర్రబెల్లి నిప్పులు, తెరాసకు అండ
సడక్ బంద్ కార్యక్రమానికి ఎందుకు అనుతివ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణవాదులను, ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం సరికాదన్నారు. తెలంగాణవాదులపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణవాదులను పోలీసులు రాత్రికి రాత్రే అరెస్టు చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వనని ముఖ్యమంత్రి చెప్పేందుకు ఇదేమైనా ఆయన జాగీరా అని ప్రశ్నించారు.
సడక్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణవాదుల అరెస్టు అక్రమమని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణవాదులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు.
కాంగ్రెసు ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. తెలంగాణపై పార్లమెంటులో బిల్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలతో అధికార పార్టీ దోబూచులాడుతోందన్నారు. కాంగ్రెసు పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
కాగా, సడక్ బందులో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు, తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేసి ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు. సడక్ బంద్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న ఓయు విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.