కోదండరామ్ సహా 7గురి అరెస్టు: 4వరకు రిమాండ్
సడక్ బంద్ సందర్భంగా వారిని అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత వదిలేయాలని అనుకున్నారు. కానీ, వారిని తొలుత రాజోలీ పోలీసు స్టేషన్కు, ఆ తర్వాత ఆలంపూర్ పోలీసు స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేశారు. అరెస్టయినవారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. కోడండరామ్, శ్రీనివాస గౌడ్, ఈటెల, జూపల్లితో అరెస్టయిన మిగతా ముగ్గురు స్థానికులు.
సడక్ బంద్ సందర్భంగా 57 మందిపై కేసులు నమోదు చేశామని డిఐజి నాగిరెడ్డి చెప్పారు. 18 మంది శాసనసభ్యులను, నలుగురు ఎమ్మెల్సీలను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం 1,177 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సడక్ బంద్ను దీటుగా ఎదుర్కున్నామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు చెప్పారు. సడక్ బంద్ సందర్బంగా ప్రత్యామ్నాయ మార్గాలను ట్రాఫిక్ కోసం చూపించామని ఆయన చెప్పారు.
తాము తెరాస శాసనసభ్యులు హరీష్ రావు, పోచారం శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ స్వామి గౌడ్ సహా 240 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. సడక్ బంద్ సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోలేదని ఆయన అన్నారు. అదుపులోకి తీసుకున్నవారిని రెండు, మూడు గంటల్లో వదిలేశామని ఆయన చెప్పారు. విజయవాడ సడక్ బంద్, చలో అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహిస్తామని కోదండరామ్ ఆందోళన సందర్భంగా చెప్పారు.
సడక్ బంద్లో పాల్గొన్నవారిని అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టినప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేరని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు. ఏడో నెంబర్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా ఉండదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఉద్యమం చేస్తున్న తెలంగాణవాదులపై ప్రతాపం చూపించారని ఆయన అన్నారు.
నిరసనలకు కెసిఆర్ పిలుపు
కోదండరామ్, ఈటెల రాజేందర్, జూపల్లి తదితరుల అరెస్టును తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఖండించారు. ఈ అరెస్టులు ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని ఆయన అన్నారు. అరెస్టులకు నిరసనగా రేపు శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.