నెట్టుకొస్తున్నారు: అందితే జుట్టు లేదంటే కాళ్లు!(పిక్చర్స్)
న్యూఢిల్లీ: అధికార కాంగ్రెసు పార్టీ యూపిఏ-2 ప్రభుత్వాన్ని బుజ్జగింపులు లేదంటే బెదిరింపులతో కొనసాగిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెదిరింపులకు లొంగకపోతే కక్ష సాధింపు చర్యలకు కూడా అధికార పార్టీ వెనుకాడటం లేదనే వాదనలు డిఎంకె వ్యవహారంతో మరింత రాజుకుంటున్నాయి. శ్రీలంక తమిళుల వ్యవహారంలో తమ డిమాండ్లను నెరవేర్చకుంటే కేంద్రం నుండి వైదొలగుతామని కరుణానిధి హెచ్చరించారు.
ఆయన అన్నంత పని చేశారు. అయితే, డిఎంకె అలా ప్రభుత్వం నుండి వైదొలగిందో లేదో గురువారం ఉదయం ఆ పార్టీ నేత, కరుణ తనయుడు స్టాలిన్ నివాసంలో సిబిఐ సోదాలు చేసింది. విదేశీ లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేశారు. డిఎంకె వైదొలగడం, వెంటనే స్టాలిన్ ఇంట్లో సోదాలు ప్రారంభం కావడం పార్లమెంటును కుదిపేసింది. డిఎంకె సభ్యులతో పాటు ఇతర సభ్యులు అధికార పార్టీ వివరణ కోసం పట్టుబట్టారు.
ఆ తర్వాత కాసేపటికే సిబిఐ సోదాలు మానుకుంది. స్టాలిన్ ఇంట్లో జరిగిన సోదాలపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం తదితరులు స్పందించారు. సోదాలు దురదృష్టకరమని, ఈ సమయంలో సిబిఐ సోదాలకు పూనుకోవడం సరికాదన్నారు. అయితే, వారు ఎంతగా ఖండించినా వెనుక అధికార పార్టీ ఉండకుండా ఇదంతా జరగదనే వాదనలు అంతకంటే బలంగా వినిపిస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ యూపిఏకు గుడ్ బై చెప్పిన సమయంలో బుజ్జగింపులు, బెదిరింపులకు పాల్పడినట్లుగా వార్తలు వచ్చాయి. తృణమూల్ గుడ్ బై చెప్పినప్పటి నుండి ఆ రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో కేంద్రం మొండి చేయి చూపిస్తోందని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు డిఎంకె వైదొలగడంతో ఆ పార్టీకి చుక్కలు చూపించపోయి విమర్శలతో వెనక్కి తగ్గారు.
ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీని వీడినప్పటి నుండి ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. కాంగ్రెసును వీడి ఆ పార్టీకి ముచ్చెమటలు పోయిస్తున్నందునే జగన్ పైన కక్షపూరిత చర్యలకు అధికార పార్టీ పాల్పడి జైలుకు పంపిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపిస్తోంది.
యూపిఏకు బయటి నుండి మద్దతిస్తున్న సమాజ్వాది పార్టీ బుధవారం మాట్లాడుతూ... యూపిఏ కంటే ఎన్డీయే బాగా పాలించిందని, మిత్రుల మధ్య ఐక్యత బాగుండేదని గుర్తు చేసింది. మన్మోహన్ సింగ్ పాలన కన్నా ఎన్డీయే హయాంలోని అటల్ బిహారీ వాజపేయి పాలన బేషుగ్గా ఉండేదని చెప్పారు. ఎన్డీయేకు వాజపేయి నేతృత్వం వహించేవారని, ఆయనే అప్పుడు పెద్ద నాయకుడన్నారు.
మరోవైపు, ఎన్డీయే హయాంలో కేంద్రం పైనే ఒత్తిడి తప్ప యూపిఏ తరహా బెదిరింపు రాజకీయాలు లేవనే వారు కూడా ఉన్నారు. నాడు ఎన్డీయేలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు తాము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పనులు సాధించామని ప్రకటించారు. మమతా బెనర్జీ, జయలలితలు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. అయితే, బెదిరింపుకు కేంద్రం అప్పుడు కేంద్రం కేసులంటూ బెదిరింపు చర్యలకు పాల్పడలేదంటున్నారు.
ఇప్పుడు కేంద్రం కేసులు, నిధులు అంటూ బెదిరింపు చర్యలకు పాల్పడుతోందనే ఆరోపణలు జోరందుకున్నాయి. జగన్, డిఎంకెలపై కేసులతో బెదిరింపు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందంటున్నారు. అందితె జుట్టు లేదంటే కాళ్లు అన్న చందంగా ప్రస్తుత ప్రభుత్వ తీరు ఉందంటున్నారు. డిఎంకె మద్దతు ఉపసంహరించడంతో కష్టాల్లో పడ్డ కేంద్రం ఎస్బీ అధినేత ములాయం సింగ్ యాదవ్ను బుజ్జగించేందుకు అపసోపాలు పడింది.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా ములాయం వద్దకు వెళ్లి వివరణ ఇచ్చుకున్నారు. అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పేది లేదని భీష్మించుకు కూర్చున్న కేంద్రమంత్రి బేణి ప్రసాద్ వర్మ నేతలు వారించడంతో ములాయంకు క్షమాపణలు చెప్పారు. మరోవైపు కేంద్రం బెదిరింపులు లేక బుజ్జగింపులతో నెట్టుకొస్తూనే అదీ కుదరకపోతే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతల్ని హెచ్చరిస్తున్నారు.
వైయస్ జగన్ కాంగ్రెసు నుండి బయటకు వచ్చాక కష్టాలు ప్రారంభమయ్యాయి. జగన్పై కేసులు, అరెస్ట్ కాంగ్రెసు కక్ష సాధింపు అని వైయస్సార్ కాంగ్రెసు మొదటి నుండి ఆరోపిస్తోంది.
డిఎంకె మద్దతు ఉపసంహరించుకున్న మరుసటి రోజే స్టాలిన్ నివాసంపై సిబిఐ దాడులు జరిగాయి. విమర్సల నేపథ్యంలో సిబిఐ దాడుల విషయంలో వెనక్కి తగ్గింది.
కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో తమ రాష్ట్రం పట్ల పార్షాలిటీ చూపిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు.
మాయావతి వంటి వారు కేసుల కారణంగా యూపిఏకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారనే వాదనలు ఉన్నాయి.
అధికార పార్టీ బెదిరింపులు లేకుంటే బుజ్జగింపులతో ప్రభుత్వాన్ని నడుపుతోందనే విమర్శలు వస్తున్నాయి.
డిఎంకె షాక్ ఇచ్చాక ములాయం సింగ్ను సోనియా గాంధీ దగ్గరకెళ్లి మరీ బుజ్జగించారు.
మన్మోహన్ కంటే వాజపేయి పార్టీలను బాగా సమన్వయం చేశారని ఎస్పీ కితాబిచ్చింది.