సంజయ్ దత్ లైఫ్: మలుపుల మీద మలుపులు
ముంబై: తన తొలి సినిమా రాకీతోనే సంజయ్ దత్ను వివాదాలు చుట్టుముట్టాయి. భారత సినీ ప్రపంచంలో తిరుగులేని నటుడిగా ఆయన ఎదిగాడు. బాలీవుడ్లో అగ్రస్థాయి నటుడిగా ప్రసిద్ధి పొంది, కెరీర్ ఉచ్ఛ స్థాయిలో ఉన్న సమయంలో 1993 ముంబై బాంబు పేలుళ్ల సంఘటన అతన్ని చుట్టుముట్టింది.
హిందీ సినిమాలో ప్రసిద్ధులైన సునీల్ దత్, నర్గీస్ దత్లకు సంజయ్ దత్ 1959 జులై 29వ తేదీన జన్మించాడు. రాకీ సినిమాతో సంజయ్ బాలీవుడ్లో ప్రవేశించాడు. తొలి చిత్రం రాకీ విడుదలకు మూడు రోజుల ముందు తల్లి నర్గీస్ మరణించింది.
బాలీవుడ్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనందటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంజయ్ దత్ ఆక్రమించుకున్నాడు. కామెడీ నుంచి రోమాన్స్ వరకు ఏది పడితే అది చేశాడు. విజయాలను అందుకున్నాడు. గ్యాంగస్టర్, పోలీసు వంటి పాత్రలు వేశాడు. ఇవి అతనికి ప్రత్యేకతను, పేరును సంతరించి పెట్టాయి.
సనవార్ లారెన్స్ స్కూల్లో విద్యనభ్యసించిన తర్వాత నటి రిచా శర్మను వివాహమాడాడు. మెదడులో కణితితో ఆమె 1996లో మరణించింది. వారికి తిషాలా అనే కూతురు జన్మించింది. ఆ తర్వాత మోడల్ రియా పిళ్లైను వివాహమాడి 2005లో విడాకులు తీసుకున్నాడు. మున్నాబాయ్ సినిమాతో హిట్ కొట్టిన సంజయ్ దత్ 2005లో గోవాలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాన్యతను పెళ్లి చేసుకున్నాడు. మాన్యతతో ఆయనకు కవలలు జన్మించారు. కుమారుడికి షహ్రాన్ అని, కూతురికి ఇఖ్రా అని పేర్లు పెట్టుకున్నారు.
సంజయ్ దత్త చిన్న వయస్సులో మత్తుపదార్థాలకు బానిస అయ్యాడు. తిరుగుబాటు మనస్తత్వం అలవడింది ఆయనకు. తల్లి మరణం అతన్ని బాగా క్రుంగదీసింది. సినిమాల్లో విజయాలు సాధిస్తున్నప్పటికీ తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు వివిధ కారణాలతో లోనవుతూ వచ్చాడు. సంజయ్ మత్తు పదార్థాలకు బానిస కావడం వల్లనే నర్గీస్ ఆరోగ్యం క్షీణించిందనే విమర్శలు ఎదుర్కున్నాడు. ఆయన నటనపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
తండ్రి సునీల్ దత్తు కుమారుడు సంజయ్ దత్తును అమెరికాలోని డ్రగ్ రిహాబిలేషన్ సెంటర్కు పంపించారు. మత్తుపదార్థాలకు స్వస్తి చెప్పి ఆరోగ్యంగా బయటకు వచ్చాడు. అయితే, 1993 ముంబై పేలుళ్ల ఘటనతో అతని జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఎకె 57 రైఫిల్ను అక్రమంగా కలిగి ఉన్నాడనే ఆరోపణపై అతను అరెస్టయ్యాడు. 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. సునీల్ దత్కు ఉన్న మంచి పేరు కారణంగా సంజయ్ బెయిల్ పొందగలిగాడు. టాడా సంబంధిత అభియోగాల నుంచి ఆయనకు 2006లో విముక్తి లభించింది. ఇప్పుడు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది.