వైయస్ లేడు, కెవిపిని జైల్లో పెట్టాలి: గాలి, విహెచ్ ఫైర్
ఎపిఐఐసిని కెవిపి జేబు సంస్థగా మార్చుకున్నాడని, కెవిపి సూచన మేరకే జగన్, కెవిపి కుమారుడి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని ఆయన ఆరోపించారు. హిమాచల్ప్రదేశ్లో పవర్ ప్లాంట్ కెవిపి తనయుడిదేనని, వైయస్ అవినీతిలో కీలక పాత్ర కెవిపిదేననే ఆయన అన్నారు. పలు బినమీ కంపెనీల్లో కెవిపికి వాటాలున్నాయని ఆయన అన్నారు. హైదరాబాదు గోపన్నపల్లెలో 250 ఎకరాలు కెవిపి సన్నిహిత బంధువులకే కేటాయించారని, సెజ్కు కేటాయించిన భూమితో స్థిరాస్తి వ్యాపారం చేశారని ఆయన ఆరోపించారు.
ఇర్రిగేషన్, ఆర్టీసి, తదితర కాంట్రాక్టులు వైయస్ హయాంలో లక్షా 80 వేల కోట్ల రూపాయల మేరకు ఇస్తే అందులో లక్ష కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఒకే కంపెనీకి ఇచ్చారని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఆ కంపెనీలో కెవిపి వాటాదారుడని ఆయన అన్నారు. కెవిపి కుమారుడు ఐదు లక్షల రూపాయల అద్దెతో ఆఫీసు పెట్టాడని ఆయన అన్నారు. దుబాయ్లో 500 కోట్ల రూపాయలతో ఆయిల్ కంపెనీలు కొనాలని కెవిపి ప్రయత్నించారని, ఆ సొమ్ము మోసపోయారని ఆయన చెప్పారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కెవిపి ప్రమేయం లేకుండా ఏ అవినీతి కూడా జరగలేదని ఆయన అన్నారు. ఖరీదైన ప్రాంతాల్లో కెవిపి కుటుంబానికి షాపులు, ఇళ్లు ఉన్నాయని ఆయన చెప్పారు. జగన్ అవినీతిలో సూత్రధారుడు కెవిపియేనని ఆయన అన్నారు. కెవిపికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఆయన అన్నారు. కెవిపి ఆస్తులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
కెవిపి రామచందర్ రావుపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కెవిపిని సిబిఐ విచారించాలని అనుకోవడం సరైందేనని ఆయన అన్నారు. వైయస్ మరణానికి సోనియానే కారణమని విజయమ్మ ఆరోపిస్తుంటే కెవిపి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. తప్పులు ఎవరు చేసినా సోనియా గాంధీ క్షమించరని ఆయన అన్నారు. అవినీతి ఎలా జరిగిందో సిబిఐకి చెప్పాల్సిన బాధ్యత కెవిపిదేనని ఆయన అన్నారు.