తుమ్మల 'జైలు' ప్రసంగానికి చంద్రబాబు కితాబు
అవినీతిలో కూరుకుపోయిన మంత్రుల సంగతి తేల్చకుండా తన ప్రభుత్వం నీతి-నిప్పు అంటే కుదరదన్నారు. "జైలు కేటగిరీలోని మంత్రులను తొలగించాల్సిందేనని, మీరు తొలగించలేకపోతే అందుకు అమ్మ అనుమతిని తీసుకోవాలని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ వైఖరి పెళ్లి జరగకపోతే కర్మ చేసేలా ఉందని తుమ్మల ఎద్దేవా చేశారు. ఎవరికీ తల వంచను, తాను మొండివాడిని అని చెప్పుకునే ముఖ్యమంత్రి ప్రాజెక్టుల విషయంలో ఎవరికో, ఎక్కడో తలవంచారన్నారు. లేదంటే అర్హత లేని కంపెనీకి టెండర్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎప్పుడు వస్తుందని తుమ్మల ప్రశ్నించారు.
ప్రతిసారీ గత 9 ఏళ్ల పాలనను, ఇప్పటి 9 ఏళ్ల పాలనకు పోల్చి మాట్లాడుతున్నారని, ఏ శాఖ అభివృద్ధి విషయంలోనైనా, అవినీతి విషయంలోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తుమ్మల పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని రైతులు, కూలీలు, విద్యార్థులు అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బొగ్గు, గ్యాస్ సాధించడంలో ఈ ప్రభుత్వ విఫలమైందన్నారు. టిడిపి హయాంలో కేవలం 5 శాతం మాత్రమే ఉండే విద్యుత్ సరఫరా నష్టాలు ఇప్పుడు 17 శాతానికి చేరాయన్నారు.
రాజీవ్ యువ కిరణాలతో 15 లక్షల మందికి ఉద్యోగాల మాట ఎలా ఉన్నా విద్యుత్ కోతల కారణంగా పరిశ్రమలు మూతపడి 25 లక్షల మంది ఉపాధి కోల్పోయారన్నారు. పరిశ్రమల అధిపతులూ ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొందన్నారు. తమది రైతుల ప్రభుత్వమని చెప్పుకొంటున్న కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాలనలో 22 వేల మంది అన్నదాతలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని తుమ్మల ప్రశ్నించారు. గిట్టుబాటు ధర లేక రైతులు ధా న్యాన్ని కల్లంలోనే రూ.700కు అమ్ముకంటున్నారన్నారు. వస్త్రాలపై వ్యాట్ను విమర్శించారు.
పోలవరం టెండర్లపై ఎవరికో లొంగారన్న వ్యాఖ్యలపై కిరణ్ మాట్లాడుతూ.. పోలవరం టెండర్ల విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయలేదన్నారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందనే పోలవరం టెండర్లు ఆమోదించామని, తాను ఎవరికీ కాంప్రమైజ్ కానని, రాష్ట్రానికి మేలు జరిగితే తప్ప అన్నారు. హైకోర్టులో ఉన్న కేసును మేం అక్కడే చూసుకుంటామని అయినా టెండర్ ఖరారయ్యాక ముహూర్తం మనం పెడతామా అన్నారు. అక్కడి రైతులే ఉత్సాహంగా కొబ్బరికాయ కొట్టారన్నారు.
దీనికి తుమ్మల చురకలు అంటించారు. అప్పటికీ, ఇప్పటికీ పోలవరం అంచనాల్లో తేడా ఎంతో గమనించాలని, కొబ్బరికాయ కొట్టే పని రైతులే చేయాలని, ఎందుకంటే గతంలో ఇద్దరు, ముగ్గురు చవఎంలు చేసినా అచ్చిరాలేదన్నారు. కాగా, తుమ్మల ప్రసంగానికి టిడిపి నేతలు అభినందనలు తెలిపారు. చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి మెచ్చుకున్నారు.