సిబిఐ ముందు కెవిపి హాజరు: వీడియో చిత్రీకరణ
కెవిపి రామచందర్ రావు విచారణను వీడియో చిత్రీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆయన సలహాల మేరకే ప్రభుత్వంలోని నిర్ణయాలన్నీ జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విచారణ కోసం సిబిఐ కెవిపి రామచందర్ రావుకు సమన్లు జారీ చేసింది. దాంతో ఆయన సిబిఐ ముందుకు వచ్చారు. సిబిఐకి తాను పూర్తిగా సహకరిస్తానని కెవిపి రామచందర్ రావు సమన్లు ఆందుకున్న తర్వాత చెప్పారు. వైయస్ హయాంలో అవినీతి కార్యక్రమాలన్నీ కెవిపి ఆధ్వర్యంలోనే జరిగాయని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఆరోపించారు. కెవిపిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, సొంత కాంగ్రెసు పార్టీకి చెందిన వి. హనుమంతరావు కూడా కెవిపిపై తీవ్రంగా మండిపడ్డారు. కెవిపిని సిబిఐ విచారణ కోసం పిలువడం సరైందేనని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని కెవిపి రామచందర్ రావు తన ఆత్మగా చెప్పుకుంటారు. కాంగ్రెసు పార్టీతో విభేదించి వైయస్ జగన్ బయటకు వచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పెట్టుకోగా, కెవిపి రామచందర్ రావు కాంగ్రెసులోనే ఉన్నారు.