ఎవరేం చేస్తున్నారు?: జైలు నుండే లీడ్ చేస్తున్న జగన్
జగన్ జైలుకు వెళ్లిన తర్వాత విజయమ్మ చేసిన దీక్షలు, పార్టీ బలోపేతం కోసం జగన్ సోదరి చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర తదితర కార్యక్రమాలు అన్ని జగన్ అనుమతితో జరిగినవే. ఇలాంటి మేజర్ విషయాలే కాకుండా ఆయా నియోజకవర్గాలలోని పార్టీ పైనా ఆయన జైలులో ఉన్నప్పటికీ దృష్టి సారించారట. తనను కలుస్తున్న నేతలను ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నారట.
పార్టీని ఎలా బలోపేతం చేయాలనే అంశంపై వారి నుండి ఆరా తీస్తున్నారు. అంతేకాదు, జైలులో ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో పార్టీ నుండి టిక్కెట్స్ ఇచ్చే అభ్యర్థుల ఎంపిక పైనా కసరత్తు చేస్తున్నారట. తనను కలుస్తున్న పలువురికి టిక్కెట్ పైన హామీ ఇవ్వడమే కాకుండా నియోజకవర్గంలో పర్యటించి పార్టీని బలోపేతం చేయాలని సూచిస్తున్నారట.
పార్టీలో నాయకుల తీరుపై ఎప్పటికప్పుడు జగన్ దృష్టికి వెళ్తోందట. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వయంగా ఇది చెప్పారు. పార్టీలో ఏయే నాయకులు ఏ రోజు ఏం చేస్తున్నారు? పార్టీ పటిష్టత కోసం ఏం చేస్తున్నారు? తదితర సమాచారం జగన్ వద్దకు ఎప్పటికి అప్పుడు చేరుతోందట.