నీ ఇలాకాలో సిద్ధమా?: కిరణ్ రెడ్డికి విజయమ్మ సవాల్
ఒక్క ఎకరం కూడా పంట ఎండిపోలేదని కిరణ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో చాలా పంట ఎండిపోయిందనే విషయం ముఖ్యమంత్రి తెలుసుకోవాలన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. ఈ పోరాటాన్ని తాము ముఖ్యమంత్రి నియోజకవర్గం నుండే ప్రారంభిస్తామని చెప్పారు. అప్పుడు ఎన్ని ఎకరాలు ఎండిపోయాయో తెలుస్తుందన్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఇందిరాపార్క్ వద్ద నిరవధిక దీక్ష చేస్తోంది. వారి దీక్షకు విజయమ్మ సోమవారం సంఘీభావం తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, కమ్యూనిస్టులు కలిసి ఉద్యమం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా తాము వామపక్షాలతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధమే అన్నారు.
హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద వామపక్ష నేతల దీక్ష మూడో రోజు కొనసాగుతోంది. వారికి పలు రాజకీయ పార్టీలు, నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ రోజు టిడిపి ఎమ్మెల్యేలు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. వైయస్సార్ కాంగ్రెసు కూడా సంఘీభావాన్ని తెలిపింది.