డిఎంకెలో ఆధిపత్య పోరు: అళగిరి అలక, భేటీకి డుమ్మా
కరుణానిధి పైన ఆగ్రహంతో ఉన్న అళగిరి సోమవారం పార్టీ సమావేశానికి హాజరు కాలేదు. శ్రీలంకలో తమిళుల హక్కులపై యూపిఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో తీర్మానం ప్రవేశం పెట్టే అంశంపై చర్చించడానికి పార్టీ కార్యవర్గం ఈ ఉదయం భేటీ అయింది. ఈ సమావేశానికి అళగిరి గైర్హాజరయ్యారు. ఆయన గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.
ఇటీవల డిఎంకె కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తున్న విషయాన్ని అళగిరితో కరుణానిధి చర్చించలేదట. అంతేకాకుండా ఈ వ్యవహారంలో స్టాలిన్ చక్రం తిప్పారని అళగిరి భావిస్తున్నారు. మద్దతు ఉపసంహరణపై తనకు మాటమాత్రమైనా చెప్పక పోవడం, స్టాలిన్కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం నచ్చని అళగిరి తన అసంతప్తిని బహిర్గతం చేస్తున్నారు.
యూపిఏకు పార్టీ మద్దతు ఉపసంహరణ సమయంలో డిఎంకెకు చెందిన ముగ్గురు మంత్రులు మొదట రాజీనామా చేయగా ఆ తర్వాత అళగిరి విడిగా వెళ్లి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఆలస్యమైనప్పుడే ఆయన పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారనే చర్చ ప్రారంభమైంది.