జగన్: ఎమ్మెల్యేలకు బొత్స క్లాస్, తెలంగాణపై పాల్వాయి
అటు ఇటు అంటూ ఊగిసలాట సరికాదని, 2014లో తిరిగి కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందని వారికి బొత్స చెప్పారట. అలా చేయడం వల్ల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించారట. పార్టీలో, నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వారిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
జగన్ పార్టీ ప్రస్తుతం సెంటిమెంట్ పైన నడుస్తోందని, సాధారణ ఎన్నికల నాటికి ఆ పరిస్థితి ఉండదని హితబోధ చేశారట. పార్టీకి ద్రోహం చేయడం సరికాదని చెప్పారట. అదే సమయంలో అంతగా ఇష్టం లేకపోతే కాంగ్రెసును వీడవచ్చునని, ఊగిసలాట మాత్రం వద్దని చెప్పారట. కాగా, బొత్స క్లాస్ తీసుకున్నది నిన్న వెళ్లాలనుకుంటే ఎవరు అడ్డుకోలేరన్న సుధీర్ రెడ్డితో పాటు శ్రీశైలం గౌడ్కు క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ తేల్చకుంటే..
జూన్ పదిహేను లోగా తెలంగాణపై కేంద్రం నుండి ఓ నిర్ణయం వచ్చే అవకాశముందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మే లేదా జూన్ నెలల్లో తెలంగాణకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయం రాకుంటే పార్టీలోని తెలంగాణ ప్రాంత నేతలు ఎవరి నిర్ణయాలు వారు తీసుకునే అవకాశముందన్నారు.
తెలంగాణపై సానుకూల ప్రకటన రాకుంటే రాజకీయంగా బతకాలనుకున్న వాళ్లు సొంత నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పార్టీలో కోమటిరెడ్డి సోదరులతో పాటు మరో ఇద్దరు ఇంటి దొంగలు ఉన్నారన్నారు. మంత్రులు జానా రెడ్డి, జైపాల్ రెడ్డిలు రాజీనామా చేయరని జోస్యం చెప్పారు.