లెఫ్ట్ దీక్షలు భగ్నం: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దీక్ష
కాగా సీపీఐ నేత నారాయణ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. బీపీ తగ్గిపోవడంతో ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు తక్షణం నారాయణకు వైద్య సహాయం అందించాలని పోలీసులకు సూచించారు. దీంతో లెఫ్ట్ నేతలు నారాయణ, రాఘవులు సహా పలువురు కార్యకర్తలను బలవంగా అరెస్టు చేశారు. వామపక్షాల దీక్షకు ప్రతిపక్షాల నాయకులంతా సంఘీభావం ప్రకటించారు. వామపక్షాలకు చెందిన ఏడుగురు నేతలను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిగతా నాయకులను నాంపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు.
ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పాత ఎమ్మెల్యే క్వార్టర్స్లో నిరవధిక దీక్షకు పూనుకున్నారు. విద్యుత్ సమస్యపై వారు ఈ నిరసనకు దిగారు. శానససభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత వారు పాదయాత్రగా పాత ఎమ్మెల్యే క్వార్టర్స్కు వచ్చారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగి రావాలని డిమాండ్ చేస్తూ వారు ఈ దీక్షకు పూనుకున్నారు. విద్యుత్ సమస్యపై మంగళవారం శానససభలో చర్చ జరిగింది. దానికి ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి సమాధానంతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సంతృప్తి చెందలేదు.
ఆ తర్వాత తెలుగుదేశం శాసనసభ్యులు శాసనసభ నుంచి పాత ఎమ్మెల్యే క్వార్టర్స్కు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత 23 మంది ముఖ్యమైన పార్టీ శాసనసభ్యులు మంగళవారం రాత్రి దీక్షకు దిగారు. రేపు బుధవారంనాడు మరో ముగ్గురు శాసనసభ్యులు దీక్షలో పాల్గొంటారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు దీక్ష సాగిస్తామని టిడిపి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి అన్నారు. విద్యుత్ సర్ చార్జీలను ప్రభుత్వమే భరించాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
కాగా, అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా శానససభను వాయిదా వేయడంపై వారు ఆందోళనకు దిగారు.