మేం కుక్కలమే కానీ: పయ్యావుల, సభలో జంతు గోల
అధికార పార్టీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ.. టిడిపి పవర్ పైన బ్లాక్ పేపర్ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. టిడిపిని ప్రజలు ఎప్పుడో బ్లాక్ లిస్టులో పెట్టారన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఒక్క కొత్త ప్రాజెక్టు రాలేదన్నారు. సర్ ఛార్జీల కోసం హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లారన్నారు. ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరిగిందని, ట్రాన్సుఫార్మర్లు పెరిగాయని చెప్పారు. అందుకే సమస్య ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఓ కథ చెప్పారు.
తల్లి పార్టీ, పిల్ల పార్టీ కొట్టుకుంటుంటే మధ్యలో అధికారం లాగేయాలని తెలుగుదేశం చూస్తోందని కొత్తపల్లి అన్నారు. టిడిపిని ఉద్దేశించి కథ చెబుతూ... ఓ అడవిలో రెండు గొర్రెలు పోట్లాడుకుంటుంటే, అక్కడకు నక్క వచ్చిందని, ఆ రెండు గొర్రెలు పోట్లాడి చనిపోతే రెండింటిని తినేయవచ్చునని నక్క భావిస్తోందని ఉద్దేశించి అన్నారు.
అనంతరం మాట్లాడిన టిడిపి నేత పయ్యావుల కేశవ్.. తాము కుక్కలమని, అధికార పార్టీని నడిపించేందుకు వాచ్ డాగ్లా ప్రధాన ప్రతిపక్షం అయిన తాము పని చేస్తున్నామని కానీ, తాము విశ్వాసంతో కూడిన కుక్కలం అన్నారు. కానీ కొందరు నక్కల్లో చేరిన గుంటనక్కలా మారారని ఆలస్యంగా అర్థమైందని ఎద్దేవా చేశారు. వినియోగం పెరిగిందని, ట్రాన్సుఫార్మార్లు పెరిగాయని చెబుతున్న ప్రభుత్వం ఏదేది ఎంత పర్సెంటేజి పెరిగిందో చెప్పాలని పయ్యావుల సవాల్ విసిరారు.
పరిశ్రమలు మూతపడుతున్నాయి: అక్బర్
విద్యుత్ కోత కారణంగా రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్నాయని మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ ఎలా వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
కాకి లెక్కలు: జెపి
విద్యుత్ నష్టాల పైన ఇంజనీర్లవి కాకిలెక్కలు అని జయప్రకాశ్ నారాయణ అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ నష్టాలు ముప్పై శాతం ఉందన్నారు. ఒక్కశాతం విద్యుత్ ఆదా చేస్తే రూ.600 కోట్ల ఆదాయం మిగులుతుందని, పదిహేను శాతం ఆదా చేస్తే రూ.9వేల కోట్లు మిగులు ఉంటుందని జెపి అన్నారు. రైతులను బాగు చేయాలని సమాజంపై భారం వేయవద్దన్నారు. విధానాలు రైతులను బాగు చేసేలా ఉండాలన్నారు. గుజరాత్లో కరెంటు కోతలు లేనే లేవన్నారు. వృధా పోతున్న విద్యుత్ను అరికట్టాలన్నారు.