శ్రీలక్ష్మి తనంత తాను నిలబడే స్థితిలో లేరు: వైద్యులు
ఈనెల 20న నాంపల్లి సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చంచల్గూడ్ జైలు అధికారులు సోమవారం, లేదా అంతకన్నా ముందే శ్రీలక్ష్మి ఆరోగ్య సమస్యలపై నివేదిక ఇవ్వాలి. కానీ, ఉస్మానియా వైద్యుల బోర్డు ఆమెకు తొలుత ఈనెల 30న అపాయింట్మెంట్ ఇచ్చింది. దాంతో జైలు అధికారులు కంగారుపడి కోర్టు 25 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిందని, ఆలోగా అపాయింట్మెంట్ ఇవ్వాలని ఉస్మానియా వైద్యులను కోరారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా వైద్యాధికారుల బోర్డు సోమవారమే నివేదిక ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.
శ్రీలక్ష్మి ఆరోగ్య సమస్యలను ఆమె నుంచి అడిగి తెలుసుకోవడంతో పాటు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని వైద్య పరీక్షలు చేసి, ఆమె నడవలేని స్థితిలో ఉన్నారని నిర్ధారించుకుని ఆ మేరకు నివేదిక సిద్ధం చేశారు. సాయంత్రం ఆ నివేదికను జైలు వర్గాలకు ఇచ్చారు. విధులు ముగించుకుని న్యాయమూర్తి సహా సిబ్బంది అంతా వెళ్లిపోతుండగా జైలు అధికారులు శ్రీలక్ష్మి ఆరోగ్య స్థితిపై నివేదికను కోర్టుకు అందజేశారు. దానిని కోర్టు స్వీకరించింది.
ఆ నివేదిక ఆధారంగా కోర్టు మంగళవారం తగు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. జైల్లో కూడా శ్రీలక్ష్మి అనారోగ్యంతో బాగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. అడుగు ముందుకు వేయాలన్నా తోటి ఖైదీల సాయం తీసుకుంటున్నట్లు సమాచారం. బాత్రూంకు వెళ్లాలంటే ముగ్గురు ఖైదీల ఆసరాతో వీల్చైర్లో వెళ్తున్నట్లు తెలిసింది.