రాజమండ్రి పట్టు: జగనే కాదు... రాయేస్తున్న జయప్రద

ఆ టిక్కెట్ కోసం ఆమె అన్ని పార్టీలలో రాయేశారట. తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకున్నట్లుగా చెబుతున్నారు. గతేడాది జయప్రద వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును పొగిడారు. అప్పుడు అమె టిడిపిలోకి వెళ్తుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా ఆమె యూ టర్న్ తీసుకున్నారు. చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు.
అందుకు రాజమండ్రి టిక్కెట్ పైన హామీ రాకపోవడమే అంటున్నారు. రాజమండ్రి టిడిపి టిక్కెట్ కోసం మురళీ మోహన్ మొదటి నుండి ఉన్నారు. దీంతో ఆమెకు ఇచ్చేందుకు అధిష్టానం అంగీకరించలేదంటున్నారు. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలో కూడా ఆమె రాయేశారట. ఉండవల్లి అరుణ్ కుమార్ 2009లోనే పోటీకి నిరాకరించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పట్టుతో ఆయన బరిలో నిలిచారు. మరోసారి ఉండవల్లి పోటీ చేస్తారా లేదా అనేది అనుమానమే.
రాజమండ్రి టిక్కెట్ కోసం ఆమె తనకు సన్నిహితంగా ఉండే కాంగ్రెసు నేతలతో కలిసి సంప్రదింపులు జరిపినట్లుగా చెబుతున్నారు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూశారంటున్నారు. జగన్ పార్టీలోను రాజమండ్రి టిక్కెట్ కోసం పోటా పోటీ నెలకొంది. టిడిపి ఎమ్మెల్సీగా ఉన్న బొడ్డు భాస్కర రామారానవు తన తనయుడికి రాజమండ్రి టిక్కెట్ కోసమే జగన్ వైపు వచ్చారని చెబుతున్నారు. దీంతో జయప్రదకు హామీ లభించి ఉండదంటున్నారు. తన రాజమండ్రి టిక్కెట్ కోసం ఆమె అన్ని పార్టీలలో ప్రయత్నాలు చేస్తుండటం వల్లనే ఏ పార్టీ నుండి పోటీ చేసే నిర్ణయం ఇంకా జరిగి ఉండక పోవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications