ఎన్టీఆర్ పొలిటిక్స్: ఆపరేషన్ 2019, ఇప్పుడు జగనే?
జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కూడా చంద్రబాబుతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. బాలకృష్ణ చంద్రబాబుకు సహకారం అందిస్తూ తెలుగుదేశం పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. పార్లమెంటుకు బాలయ్య పోటీ చేస్తారని తెలుగుదేశం పార్టీలోని కొంత మంది నాయకులు అంటుండగా, తాను శానససభకే పోటీ చేస్తానని ఆయన పదే పదే చెబుతున్నారు. దీన్ని బట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో ఓ అధికార కేంద్రంగా మారేందుకు సిద్ధపడినట్లు అర్థమవుతోంది.
తన తనయుడు నారా లోకేష్కు తెలుగుదేశం పార్టీ నాయకత్వ పగ్గాలు అప్పగించడానికి జూనియర్ ఎన్టీఆర్ను దూరంగా ఉంచాలనే స్థిర నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ను తెలుగుదేశం పార్టీలోకి రానీయడం లేదని, అటువంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించి తన భవిష్యత్తును తాను చూసుకోవాలి కదా అని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో అన్నారు. రానిస్తే తాను కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ చంద్రబాబు రానీయడని ఆమె అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ను కూడా రానీయడం లేదని ఆమె అన్నారు.
మరో వైపు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీన్నిబట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంత జరుగుతున్నా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు నోరు విప్పలేదు. పైగా, నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టే లోగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారాన్ని తేల్చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పక్కా ప్లాన్ ప్రకారమే వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు, అంటే 2014లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించే పరిస్థితి లేదు. సినిమాలతో ఆయన తీరిక లేకుండా ఉన్నారు. సినిమాలను వదిలేసి రాజకీయాలకు రావడం కూడా ఆయన ఉద్దేశం కాదు. కానీ, భవిష్యత్తు రాజకీయ ప్రవేశానికి తగిన ఏర్పాటు మాత్రం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
2019 ఎన్నికల నాటికి రాజకీయాల్లో తన సత్తా చాటాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈలోగా తన వర్గానికి చెందినవారిని ఇతరత్రా మార్గాలు చూసుకోవాలని ఆయన సూచించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారని, వల్లభనేని వంశీ తిరుగుబాటుకు సిద్ధపడ్డారని అంటున్నారు.
ఈ పరిణామాన్ని వైయస్ జగన్ కూడా జాగ్రత్తగానే గమనిస్తున్నట్లు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎత్తుగడలను ప్రస్తుతానికి తనకు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే, తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చెందిన నాయకులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద, రాజకీయాలు జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారంతో రసకందాయంలో పడ్డాయి.