మరో ఉచ్చు: జగన్ కేసులోనూ శ్రీలక్ష్మి పేరు
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఆమెని నిందితురాలుగా చూపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరో కేసులో ఆమెని నిందితురాలిగా చేర్చుతున్నట్లు సిబిఐ తరఫు న్యాయవాది స్వయంగా కోర్టుకు తెలిపారు. ఆమెతోపాటు అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వి.డి. రాజగోపాల్ను కూడా సహ నిందితుడిగా చేర్చే అవకాశముంది. పెన్నా సిమెంట్స్కు మేళ్లు చేకూర్చారనే అభియోగం మోపనున్నట్లు తెలుస్తోందని వార్తలు వచ్చాయి. ఆ దిశగానే సమాచార సేకరణ జరుగుతోందని, అందులో భాగంగానే పెన్నా సిమెంట్స్ ప్రతినిధులను కొద్ది రోజులుగా సిబిఐ ప్రశ్నిస్తోందని తెలియవచ్చింది. అక్రమాస్తుల కేసులో మరో ఇద్దరు ఐఏఎస్లను కూడా నిందితులుగా చేర్చే విషయం కూడా పరిశీలనలో ఉందని సమాచారం.
శ్రీలక్ష్మికి నాలుగైదు నెలలపాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టు భావిస్తే అభ్యంతరం చెప్పబోమని సిబిఐ స్పష్టం చేసింది. ఆమె పేరు మరో కేసులో కూడా చేర్చనున్నామని, ఈ నేపథ్యంలో కేసు పరిష్కారమయ్యేంత వరకు బెయిల్ అడిగితే మాత్రం అభ్యంతరం చెబుతామని సిబిఐ కోర్టుకు మంగళవారం వెల్లడించింది. అయితే దీనికి డిఫెన్స్ లాయర్ సురేంద్ర అభ్యంతరం చెప్పారు.
ఇన్నాళ్లు దర్యాప్తు పూర్తికాలేదని బెయిల్కు అడ్డుపడిన సిబిఐ ఇప్పుడు మరో కారణం చెబుతోందన్నారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై ఉస్మానియా వైద్యులు కోర్టుకు సోమవారం ఇచ్చిన నివేదికను చదివి వినిపించారు. మరొకరి సాయం లేకుండా ఆమె కనీసం నిలబడలేక పోతున్నారని తెలిపారు. వాదనలు పూర్తికావడంతో తీర్పు 30కి వాయిదా పడింది.
జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు పెన్నా సిమెంట్స్ ప్రతినిధులను మంగళవారం విచారించారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పెన్నా కంపెనీ వైయస్ ప్రభుత్వ హయాంలో మేళ్లు పొందింది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి తుది చార్జిషీటు వేయనున్న నేపథ్యంలో పెన్నా ప్రతినిధుల విచారణ కీలక పరిణామంగా భావిస్తున్నారు. వైయస్ ప్రభుత్వ హయాంలో ఏపీఐఐసీ జనరల్ మేనేజర్గా పనిచేసిన సుధాకర్ను(ప్రస్తుతం రిటైరయ్యారు) పిలిచి విచారించారు.
అప్పట్లో పెన్నాకు మేళ్లు చేస్తూ తీసుకొన్న నిర్ణయాలు, ఉత్తర్వులు, ఇతర వ్యవహారాలకు సంబంధించి సిబిఐ అధికారులు విచారించినట్లు తెలిసింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించి ఏడు కీలక అంశాలపై సిబిఐ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. కాగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి పెన్నా సిమెంట్స్ కంపెనీ జరిపిన ఆర్థిక లావాదేవీల విషయమై ఎస్బీఐ అధికారులను దిల్కుషాకు పిలిపించి, రికార్డులను పరిశీలించారు.