సూర్యనెల్లి రేప్ కేసు: కురియన్కు కోర్టు నోటీసు
అత్యాచార బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్ను థొడపుఝా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అబ్రహం మాథ్యూ విచారణకు స్వీకరిస్తూ కేసు ప్రధాన నిందితుడు ధర్మరాజన్, మరో ఇద్దరు నిందితులు జమాల్, ఉన్నకృష్ణన్లకు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. పిటిషన్పై విచారణను మే 29వ తేదీన చేపడుతారు.
తిరువనంతపురం పూజాపుర జైలులో ఉన్న ధర్మరాజన్ను మే 29వ తేదీన కోర్టులో హాజరు పరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసులో కురియన్ పాత్రపై మరింత దర్యాప్తు జరపాలని కోరుతూ బాధితురాలు దాఖలు చేసిన ఫిర్యాదును ఇంతకు ముందు పీర్మేడు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తోసిపుచ్చారు.
బెయిల్ జంపైన ధర్మరాజన్ తాను అరెస్టు కావడానికి ముందు ఓ టెలివిజన్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాలను బాధితురాలి న్యాయవాదులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. 1996 ఫిబ్రవరి 19వ తేదీన కురియన్ను అతిథిగృహానికి తీసుకుని వెళ్లినట్లు అతను చెప్పాడు. ఆ అతిథి గృహంలోనే అమ్మాయిపై అత్యాచారం జరిగింది.
ధర్మరాజన్ వెల్లడించిన వివరాలతో బాధితురాలు మార్చి 1వ తేదీన పీర్మేడ్ కోర్టులో ఫిర్యాదు చేసింది. కురియన్పై గత నెలలో ఆమె కొట్టాయం పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. కురియన్ను నిందితుడిగా చేర్చాలని కోరుతూ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు నమోదు చేసుకోలేదు.
కేరళలోని ఇడుక్కి జిల్లా సూర్యనెల్లికి చెందిన అమ్మాయిని ఎత్తుకెళ్లి 1996లో వివిధ ప్రాంతాలకు తిప్పుతూ 40 మంది ఆమెపై లైంగిక దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలకు సంబంధించిన కేసు ఇది. తనపై లైంగిక దోపిడీకి పాల్పడినవారిలో కురియన్ కూడా ఉన్నారని ఆమె చెప్పినప్పటికీ ఆయన పేరు చేర్చలేదు.
ఈ కేసులో 35 మందికి విముక్తి కలిగిస్తూ కేరళ హైకోర్టు 2005 ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఇటీవల నిర్ణయం వెల్లడించింది. దీంతో సూర్యనెల్లి కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. ధర్మరాజన్ శిక్షను తగ్గిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రత్యేక కోర్టు ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు నిందితులందరినీ ఆదేశించింది.