వారి వల్లేనన్న జగ్గారెడ్డి: వైయస్, చంద్రబాబు పైనేనా?
నాటి సిఎంల అనాలోచిత నిర్ణయాలకు ఇప్పుడు అనుభవించాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ విషయంలో వాస్తవాలు చెబుతున్నారన్నారు. ప్రతిపక్షాలు విద్యుత్ సమస్యను తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయని మండిపడ్డారు. విద్యుత్ సమస్య విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాల్సింది పోయి రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని చూడటం దారుణం అన్నారు.
తెలంగాణపై...
తెలంగాణపై తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలది రెండు నాల్కల ధోరణి అని మండిపడ్డారు. తెలంగాణ విషయంలో అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని గతంలో తెరాస అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పార్టీ సభ్యులే సభను అడ్డుకోవడం దేనికి సంకేతం అన్నారు. ఇది రాజకీయ లబ్ధి కోసం కాదా అని ప్రశ్నించారు.
కాగా, గత సిఎంల వల్లే విద్యుత్ సమస్య అని జగ్గారెడ్డి చెప్పడం.. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులే లక్ష్యంగా ఆయన మాట్లాడినట్లుగా భావిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు పార్టీకి చెందిన వైయస్ను కూడా ఆయన విద్యుత్ సమస్యకు కారణంగా పరోక్షంగా చెప్పారని అంటున్నారు.