ఉద్దండుల పోరు: పురంధేశ్వరితో షర్మిల ఢీకొంటుందా!?
రాజమండ్రిలాగే విశాఖపట్నంలో పోటీకి సిట్టింగ్, మాజీలతో పాటు పలువురు సిద్ధమవుతున్నారు. కాంగ్రెసు పార్టీలో ఇప్పటికే టి.సుబ్బిరామి రెడ్డి, కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాను విశాఖ నుండే పోటీ చేస్తానని, పురంధేశ్వరి బాపట్ల లేదా నరసాపురం నుండి పోటీ చేసేందుకు అంగీకరించారని టిఎస్సార్ చెబుతుండగా.. పురంధేశ్వరి మాత్రం విశాఖను వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ఇప్పటికే టియస్సార్ గెలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారట.
విశాఖ టిక్కెట్ కోసం మాత్రం కాంగ్రెసులో టిఎస్సార్, పురంధేశ్వరిల మధ్య హోరాహోరీ నడుస్తోంది. ఈ గొడవ అధిష్టానం వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిష్టానానికి ఏవిధంగా చూసిన ఇద్దరినీ వదులుకోలేని పరిస్థితి. అయితే, మరోసారి టిఎస్సార్ను బుజ్జగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. పురంధేశ్వరి సైలెంట్గా తన పని తాను చేసుకు వెళ్తున్నా అంతర్గతంగా విశాఖపై ఆమె ససేమీరా అంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మరోసారి ఆమెకే టిక్కెట్ ఇస్తారని అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రతో ప్రస్తుతం ప్రజల్లో ఉండి పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. ఈమె కడప పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, అప్పటికే జగన్ తన సోదరుడు అవినాష్ రెడ్డికి ఈ టిక్కెట్ పైన హామీ ఇచ్చారు.
దీంతో షర్మిల అసంతృప్తికి కూడా గురయ్యారట. అయితే షర్మిలను విశాఖ నుండి బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తున్నట్లుగా సమాచారం. కడప విషయంలో అసంతృప్తికి గురైన షర్మిల సేఫ్ అండ్ భారీ మెజార్టీ వచ్చే సీటు కోసం చూస్తున్నారట. విశాఖ నుండి పురంధేశ్వరి లేదా టిఎస్సార్ బరిలోకి దిగినా తమ పార్టీయే గెలుస్తుందని జగన్ పార్టీ గట్టిగా భావిస్తోందట. రాజకీయ సమీకరణాలు కూడా ఉపయోగపడతాయంటున్నారు.
2009లో పురంధేశ్వరిపై తెలుగుదేశం పార్టీ తరఫున ఎంవివిఎస్ మూర్తి, ప్రజారాజ్యం పార్టీ తరఫున పల్ల శ్రీనివాస్ యాదవ్లు పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాగైనా విశాఖను కొట్టాలని భావిస్తోంది. టిడిపి నుండి సుజనా చౌదరి బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. స్థానికులకే ఇవ్వాలన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే, అందుకోసం భారీ కసరత్తు చేస్తోంది. ఎన్నికలు 2014లో జరిగినా లేదా ముందస్తుకు అవకాశమున్నా రాజమండ్రిలాగే విశాఖలోను మూడు పార్టీల నుండి హేమాహేమీలు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.