మోడీతో యుఎస్ ప్రతినిధుల భేటీ, అమెరికాకు పిలుపు
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో గురువారం అమెరికాకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సమావేశమైంది. మోడీని ఆ బృందం అమెరికాకు ఆహ్వానించింది. మోడీకి అమెరికా వీసా నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ ఆహ్వానం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మోడీతో సమావేశమైన ప్రతినిధుల్లో ఒక్కరైన ఎంపి ఆరన్ స్కాక్ మాట్లాడుతూ - గుజరాత్తో కలిసి పనిచేసేందుకు అమెరికన్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని చెప్పారు.
కఠోరదీక్ష, లక్ష్యాలతో రాష్ట్రంలో అభివృద్ధి సాధించినట్లు మోడీ వారికి తెలిపారు. అమెరికా ప్రతినిధుల ఆహ్వానానికి మోడీ సానుకూలంగా ప్రతిస్పందించారు. జూన్లో మోడీ అమెరికా పర్యటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అత్యుత్తమ పెరుగుదల రేటు సాధిస్తున్న గుజరాత్ అభివృద్ధిని ఆరన్ స్కాక్ ప్రశంసించారు.
ప్రజల్లో మోడీ సాధిస్తున్న సానుకూల మార్పును అమెరికా ప్రతినిధులు ప్రశంసించారు. గుజరాత్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రోడ్జర్ చెప్పారు. గుజరాత్ శ్రమశక్తిని చూసి విదేశీయులు గుజరాత్కు ఎక్కువగా వస్తున్నారని లూమ్మిస్ అన్నారు.
ప్రభుత్వ చొరవ కారణంగా అమెరికన్లు గుజరాత్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారని స్కాక్ అన్నారు. తమ అభివృద్ధి నమూనాకు ప్రజల భాగస్వామ్యం, కఠిన శ్రమ చోదకశక్తులని మోడీ వారికి చెప్పారు. భారతదేశంలో ప్రజాతంత్ర ప్రక్రియ మరింత బలపడుతుందని ఆయన అన్నారు.