అశోక గజపతి రాజుకు రాజయోగం: జోస్యం చెప్పిన నేత
దాంతో ఆయనీసారి కేంద్ర మంత్రి అవుతారని పక్కన ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆశాభావం వ్యక్తం చేశారు. నిరాహార దీక్ష శిబిరంలో టిడిపి జ్యోతిష్కుడు కాసేపు సందడి చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన కోటేశ్వర రావు వ్యక్తిగత ఆసక్తితో వాస్తు సలహాలు, జాతకాలు చెబుతుంటారు. ఎంబియే చదివిన తాను ఈ శాస్త్రాలు కూడా చదివానని, వాటి ఆధారంగా తన అంచనాలు చెబుతుంటానని ఆయన చెప్పారు.
దీక్షలో ఉన్న చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కొద్దిసేపు పక్కకు వచ్చి కూర్చున్నప్పుడు కోటేశ్వర రావు ఆయనకు చెయ్యి చూసి చెప్పారు. ఇదే క్రమంలో అశోక్ చేయి కూడా చూశారు. ఇందిరా గాంధీ చేతిలో ఉన్నట్లే అశోక్ చేతిలో కూడా శుక్ర రేఖ బలంగా ఉందని, భవిష్యత్తులో ఆయన ఇంకా పెద్ద పదవులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ఇంతలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే జివి ఆంజనేయులు.. తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు తృతీయ కూటమి అంటున్నారని, అలా అయితే అశోక్ కేంద్రంలో కేంద్రమంత్రి అవుతారేమోనని వ్యాఖ్యానించారు. దీనిని బట్టి కేంద్రంలో ఈసారి తమకు మంచి రోజులు వచ్చేలా ఉన్నాయన్నారు. పుల్లారావుకు కూడా రాజకీయ భవిష్యత్తు బాగుందని కోటేశ్వర రావు చెప్పారు. అశోక్ మాత్రం ఏ వ్యాఖ్యా చేయకుండా నవ్వుతూ అంతా విని ఊరుకొన్నారు.