దీక్ష చేస్తున్న టిడిపి ఎమ్మెల్యే సత్యవతికి తీవ్ర అస్వస్థత
పాత ఎమ్మెల్యే క్వార్టర్సులో కూర్చున్న ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు, ఎంపీల ఆరోగ్యాన్ని వైద్యులు ఈ రోజు ఉదయం పరీక్షించారు. వారిలో తొమ్మిది మంది ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అయితే, ప్రభుత్వం దిగి వచ్చి విద్యుత్ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని నేతలు చెప్పారు. దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేలు అక్కడే పార్టీ అవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఘనంగా ఆవిర్భావ దినోత్సవం
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగర పార్టీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి నివాళులు అర్పించారు. టిడిపి ఈ రోజు 32వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.
ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో టిడిపి నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడే విధంగా టిడిపి పాలన సాగిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు టిడిపిని స్థాపించారన్నారు.
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా పెదపూడిలో ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. ఆయన వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉండటంతో అక్కడే ఉత్సవంలో పాల్గొంటారు. విద్యుత్ సమస్య పైన దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడారు.