రూలర్: ఆ ఒక్కటి ఈసారి చంద్రబాబును గట్టెక్కించేనా?
పాదయాత్రకు ముందు ఇరు ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి అంత బాగా లేదు. పాదయాత్ర సాగుతున్న కొద్ది పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఓ వైపు నిస్తేజంలో ఉన్న పార్టీని బాబు మార్చే ప్రయత్నాలు చేస్తుండగానే పార్టీలో కుటుంబ విభేదాలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు ఇతర పార్టీల్లోకి చూస్తుండటం, నేతల మధ్య కొట్లాట పార్టీని ఇబ్బందులకు గురి చేస్తోంది. నారా, నందమూరి కుటుంబాల మధ్య విభేదాలు లేవని పరోక్షంగా చెబుతూనే, మరోవైపు నేతలకు చివాట్లు పెడుతూ చంద్రబాబు తన యాత్రను కొనసాగిస్తున్నారు.
పాదయాత్ర ఉత్సాహమో, నారా-నందమూరి మధ్య విభేదాలు సమసిపోవడమో పార్టీని గట్టెక్కించడంలో పాత్ర వహించడం విషయం పక్కన పెడితే చంద్రబాబును 'ఆ ఒక్కటి' గట్టిక్కిస్తుందా? అనే ప్రశ్న అందరిలోను తలెత్తుతోంది. సిపిఐ నేత కూనంనేని సాంబశివ రావు వ్యాఖ్యలతో ఇప్పుడు కొత్త చర్చ సాగుతోంది. చంద్రబాబుకు మంచి పరిపాలకుడిగా పేరు ఉన్నది. తన హయాంలో కొన్ని కఠినమైన మరికొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నప్పటికీ పరిపూర్ణ పాలకుడు అనే పేరు మాత్రం ఉంది.
నిన్న దీక్ష సమయంలో కూనంనేని మాట్లాడుతూ... తాను పొత్తుల గురించి అప్పుడే మాట్లాడదల్చుకోలేదని కానీ, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం గాడిలో పడుతుందని, అది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. కూనంనేనిలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో చాలామందిలో ఇదే అభిప్రాయం ఉందని టిడిపి నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉందని, రాష్ట్రం గాడిన పడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని యువతలోను నాటుకుపోయిందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కట్టెక్కించగలిగే సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉందని వారు గట్టిగా భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వారు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కూడా భావిస్తున్నారట. విద్యుత్ సంక్షోభం, ధరల పెరుగుదల, రైతుల కన్నీళ్లు.. ఇలా రాష్ట్రంలో పెక్కు సమస్యలున్నాయి. రాష్ట్రంలోని సమస్యల పైన యువత కూడా అవగహన కలిగి ఉందని, బాబు పాలనకు, కాంగ్రెసు పాలనకు బేరీజు వేసుకుంటున్నారని, అందుకే తమ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని టిడిపి నేతలు చెబుతున్నారు.
బాబు పాలనలో లోపాలు కూడా ఉన్నాయని, ఇంత స్థాయిలో కాకున్న బాబు తన హయాంలో విద్యుత్ ధరల పెంపు, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం, ఉద్యోగుల నుండి వ్యతిరేకత.. ఇలా ఆయన పాలనలోను ఉన్నాయని మరికొందరు అంటున్నారు. అయితే, బాబు ఇప్పటికే కొన్ని విషయాల్లో తన తప్పును అంగీకరించారని, వ్యవసాయం దండుగ అనే మాట అనకున్నా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. అన్నింటిని మించి బాబు హయాంలోను పరిస్థితులు పూర్తిగా బాగున్నాయని చెప్పలేకున్నా ఇప్పుడు రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తప్ప మరొకరు రక్షించలేరనే గట్టి భావనలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని తెలుగు తమ్ముళ్లు గట్టిగా భావిస్తున్నారు.