అధికారంలోకి వస్తే తెలంగాణపై తీర్మానం పెడ్తాం: ఎర్రబెల్లి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాబ్లీ ప్రాజెక్టు విషయంలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ సమస్యపై ప్రభుత్వం స్పందించే వరకు తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అంధకారంలో మునిగి పోవడానికి కారణం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీయేనని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సోమయాజులుపై దర్యాఫ్తు
వైయస్ రాజశేఖర రెడ్డికి సోమయాజులు లాంటి వాళ్లు సలహాలు ఇవ్వడం వల్లనే ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఇలా దాపురించిందని టిడిపి నేత కెఈ కృష్ణమూర్తి అన్నారు. అలాంటి సలహాల వల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉందన్నారు. సోమయాజులు పైన సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలివి తక్కువ ప్రభుత్వం: రాఘవులు
దీక్ష చేస్తున్న టిడిపి ఎమ్మెల్యేల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ప్రభుత్వం స్పందించక పోవడం దారుణం అని సిపిఎం నేత రాఘవులు అన్నారు. ఆయన శుక్రవారం దీక్షా శిబిరంలో నేతలను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేతల ప్రాణాల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వంపై పోరాటం చేసేందుకైనా నేతలు ప్రాణాలు నిలుపుకోవాలని, బదులుగా ఇతర నేతలు కూర్చోవాలని సూచించారు. ఇది తలతిక్క, తెలివితక్కువ ప్రభుత్వమని మండిపడ్డారు.
ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే: కిషన్ రెడ్డి
కిరణ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, ప్రజలపై పన్నుల భారం మోపడం తప్ప మరొకటి తెలియదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నడు లేని సంక్షోభంలో ప్రస్తుతం రాష్ట్రం ఉందన్నారు. ప్రభుత్వం వైఫల్యం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. కేంద్రం నిధులను సక్రమంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు.