ఎస్సైపై దొంగల కాల్పులు: వేధింపు..భర్తను చంపిన భార్య
కవేలి సిండికేట్ బ్యాంకులో దోపిడీ దొంగలు దొంగతనం చేస్తుండగా ముగ్గురు దోపిడీ దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దొంగతనం చేస్తుండగా సమాచారం అందుకున్న ఎస్సై వెంకటేష్ దొంగలను పట్టుకునేందుకు ఘటనాస్థలికి చేరుకున్నాడు. దీంతో అగంతకులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.
భర్తను చంపిన భార్య
హైదరాబాదులోని బంజారాహిల్సులో ఓ భార్య భర్తను కొట్టి చంపింది. తన భర్త రోజు మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని భార్య అతనిని కొట్టి చంపింది. అనంతరం మృతదేహాన్ని కిరోసిన్ పోసి తగులబెట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని భార్యను అదుపులోకి తీసుకున్నారు.
ఇంద్రాణి, వెంకటేష్ దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. భర్త ఇతరులతో సంబంధం పెట్టుకోవడంతో పాటు మద్యం తాగి వచ్చి వేధించినందువల్లే ఆమె అతనిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. వారికి ముగ్గురు కుమారులు. ఇద్దరు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తుండగా.. ఓ కొడుకు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు.
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. మహబూబ్ నగర్ మండలం మన్యంకొండ వద్ద కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మరో ఘటనలో షాద్ నగర్ సమీపంలో రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని క్వాలిస్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.