శ్రీలక్ష్మికి ఊరట: మధ్యంతర బెయిల్ మంజూరు
సిబిఐ వాదనను అంగీకరిస్తూ కోర్టు శ్రీలక్ష్మికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరుకు కోర్టు ఆమెకు షరతులు విధించింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని, సిబిఐ దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని ఆదేశించింది. దాంతో పాటు 2 లక్షల రూపాయలతో ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును కూడా నాంపల్లిలోని సిబిఐ కోర్టు అడిగింది.
ఇలావుంటే, ఆమె ఆరోగ్యం ఏ మాత్రం బాగా లేదంటూ వార్తాకథనాలు వస్తున్నాయి. ఆమె కుడికాలు, కుడిచేయి స్పర్శ కోల్పోయినట్లు తెలిసింది. ఆమె కనీసం నిలబడలేకపోతున్నట్లు సమాచారం. జైలులో మంచానికే పరిమితమైన ఆమె బాధ చూడలేక తోటి మహిళా ఖైదీలు కూడా చలించిపోయినట్లు తెలిసింది. ఆమెకు వారే సపర్యలు చేస్తున్నారని, భోజనం కూడా వారే తినిపిస్తున్నారని అంటున్నారు. ఆమెను వీల్ చెయిర్లో కూర్చోబెట్టుకుని వారే కాలకృత్యాల నిమిత్తం తీసుకెళుతున్నట్లు తెలిసింది.
శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగలేదని ఉస్మానిమా ఆస్పత్రి వైద్యుల బృందం కూడా చంచల్గూడ జైలు అధికారులకు ఇప్పటికే నివేదిక ఇచ్చారు. ఆమెను ఈనెల 21న జైలు అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. జనరల్ సర్జరీ, న్యూరోసర్జరీ, న్యూరాలజీ, యూరాలజీ, కార్డియాలజీ విభాగాల అధిపతులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆమె కుడి చేతి స్పర్శలో తేడా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. దీని తీవ్రత గుర్తించేందుకు షాక్ కూడా ఇచ్చినట్లు సమాచారం.
అప్పుడే శ్రీలక్ష్మి బాగా కన్నీరుపెట్టుకున్నట్లు చెబుతున్నారు. "ఆమె ఎడమ కాలి జాయింట్ల వద్ద, వెన్ను ఆపరేషన్ జరిగిన చోట కండరాల నొప్పి తీవ్రంగా ఉంది. ఆమె సొంతంగా లేచి నిలబడే స్థితిలో కూడా లేరు'' అని వైద్యులు తమ నివేదికలో తెలిపారు. వెన్నుపూస కండరాలు అరిగిపోవడంతో నరాలపై ఒత్తిడి పెరిగిందని, దీనివల్ల సమస్యలు తలెత్తుతున్నాయని వారు గుర్తించినట్లు చెబుతున్నారు. మధ్యంతర బెయిలు రద్దయిన అనంతరం ఆమె ఈనెల 21న చక్రాల కుర్చీలోనే చంచల్గూడ జైలుకు వచ్చారు.
ఈమె నడుము భాగం, మెడ చుట్టూ పట్టీలు కనిపించాయి. ఉస్మానియా ఆస్పత్రిలోనూ ఆమెను చక్రాల కుర్చీలోనే తిప్పాల్సి వచ్చింది. చంచల్గూడ జైలులో శ్రీలక్ష్మికి ప్రత్యేక తరగతి హోదా ఉంది. అయినప్పటికీ, మంచం మినహా ఆమె ఇతరత్రా సౌకర్యాలను పెద్దగా వాడుకోవడంలేదు. ప్రత్యేకంగా వంట చేయించుకునే అవకాశమున్నా ఆహారంపైనా ఆమె మొదటి నుంచి ఆసక్తిగా చూపడంలేదంటూ ఆ దినపత్రిక రాసింది.