సిటీలో లేను: అవిశ్వాసంపై తగ్గిన చిన్నం రామకోటయ్య
దీంతో స్పీకర్ టిడిపి ఎమ్మెల్యేలు తొమ్మిది మందికి నోటీసులు జారీ చేశారు. కాంగ్రెసు కూడా ఫిర్యాదు చేయడంతో ఆ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మొత్తం రెండు పార్టీలకు చెందిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నిన్న నోటీసులు జారీ చేశారు. అందులో నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య పేరు కూడా ఉంది. దీంతో ఆయన ఈ రోజు స్పందించారు.
తెలుగుదేశం పార్టీ తనకు ఎలాంటి విప్ జారీ చేయలేదని, తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎక్కడా పాల్పడలేదని చిన్నం రామకోటయ్య టిడిపి విప్ దూళిపాళ్ల, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు లేఖలు రాశారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో తాను హైదరాబాదులో లేనని, తన ఆరోగ్యం బాగా లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. తనపై పిటిషన్ను ఉపసంహరించుకోవాలని ఆయన అందులో కోరారు.
వెనక్కి తగ్గారా?
2009లో టిడిపి తరఫున గెలిచిన చిన్నం మొదట జగన్ పార్టీలోకి వెళ్తారని భావించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెసు వైపుకు వెళ్లారు. అయితే, విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో అధికార పార్టీ తీవ్రమైన ఇరకాటంలో పడింది. దీంతో ఆయన అధికార పార్టీకి మద్దతిచ్చే అంశంపై పునరాలోచించుకున్నారా? లేక ఉప ఎన్నికలకు వెళ్లడం ఇష్టం లేకనే విప్ ధిక్కరించలేదని చెప్పారా? అనే చర్చ సాగుతోంది. అదే సమయంలో బాబు పాదయాత్ర నేపథ్యంలో టిడిపి క్రమంగా పట్టు బిగుస్తోంది.