వైఎస్ నుండే భ్రష్టు పట్టించారు: బాబు, అంతలేదు: కిరణ్
విద్యుత్ వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ భ్రష్టు పట్టించిందని, కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని చీకటి రాజ్యం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది గుడ్డి ప్రభుత్వమని, టిడిపి హాయంలో నాలుగేళ్లు కరువు ఉన్నా రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చామని గుర్తు చేశారు. కిరణ్కు విద్యుత్పై అవగాహన లేదన్నారు. కరెంట్ను ముందే కొని వుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదన్నారు.
కరెంట్ కొనుగోలు, బొగ్గు దిగుమతుల్లో కిరణ్ అవినీతికి పాల్పడ్డారని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి డబ్బు తీసుకుని ప్రయివేటు కంపెనీలకు అనుమతులు ఇచ్చారని, ఆ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు కరెంట్ను అమ్ముకుంటున్నారని, ఇందులో మనకు మిగిలింది మాత్రం కాలుష్యం, బూడిదే అని ఆయన విమర్శించారు. యూనిట్కు రూ.12.30 పైసలకు కరెంట్ కొంటున్నామని కిరణ్ చెబుతున్నారని, అందులో ఆయన వాటా ఎంత అని చంద్రబాబు ప్రశ్నించారు.
సమర్థవంతమైన విద్యుత్ వ్యవస్థను అప్పగిస్తే వైయస్ నుంచి కిరణ్ వరకు నాశనం చేశారన్నారు. విద్యుత్ రంగాన్ని రూ.40 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టారన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు పనికిరాని వాళ్లన్నారు. కిరణ్కి ధైర్యం ఉంటే 1994 నుంచి 2013 వరకు విద్యుత్పై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని చంద్రబాబు సవాల్ విసిరారు. అప్పుడు ఎవరు ఏం చేశారో తెలుస్తుందన్నారు.
తాము విడుదల చేసిన బ్లాక్ పేపర్పై కట్టుబడి ఉన్నట్లు బాబు తెలిపారు. ఎండిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల వల్ల చిన్న పరివ్రమలను కోలుకోలేని దెబ్బతీశారని చంద్రబాబు మండిపడ్డారు. విద్యుత్ లైన్లు పకడ్బందీగా ఉంటే సరఫరాలో నష్టం ఉండదన్నారు.
ప్రతిపక్షాలు చెబుతున్నంత లేదు: కిరణ్
పేదలకు ఇబ్బంది కలగకుండా చూడటమే కాంగ్రెసు ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం అన్నారు. ప్రతిపక్షాల నుండే కాకుండా సొంత పార్టీ నేతల నుండి విద్యుత్ ఛార్జీలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమంలో ఉన్న ఆయన స్పందించారు.
విద్యుత్ ఛార్జీలు పెంచామని విపక్షాలు, మీడియా గగ్లోలు పెడుతోందని, యూనిట్కు రూ.12.30 ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తున్నామన్నారు. విపక్షాలు, పత్రికలు చెబుతున్న స్థాయిలో ఏమీ లేదన్నారు. ఈ ఏడాది రైతులకు రూ.7 లక్షల కోట్ల రుణాలు అందుతున్నాయన్నారు. ఈఆర్సీ ప్రతిపాదించిన విద్యుత్ ఛార్జీలపై సమీక్ష జరుపుతామని హామీ ఇచ్చారు.