బాబుపై షర్మిల మాటే నిజమా?: పాల్వాయి నోటా అదే
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై షర్మిల, వైయస్ విజయమ్మలతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చేస్తున్న మాటలు వాస్తవమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కాపాడుతున్నారని, కాపాడుతారని వారు తెంపు లేకుండా వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు.
కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మంగళవారం చేసిన ప్రకటనలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల మాటలను బలపరుస్తున్నాయి. ఆయన కూడా ఓ రాయి విసిరారేమో తెలియదు గానీ చంద్రబాబుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు ప్రజల్లో ప్రచారం విపరీతంగా లభించే అవకాశాలు మాత్రం ఉన్నాయి.
మరో 20 మంది శాసనసభ్యులు తమ పార్టీని వీడిపోయినా నష్టమేమీ లేదని, ప్రభుత్వం పడిపోయే స్థితి వస్తే చంద్రబాబు ఆదుకుంటారని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మంగళవారం అన్నారు. ఈ ప్రకటన సంచలనానికి దారి తీసింది. చాలా మంది శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారని, ఈ విషయం తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా తెలుసునని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేవారిలో మంత్రులు కూడా ఉన్నారని ఆయన అన్నారు.
తమ శాసనసభ్యులు, మంత్రులు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసినా కాంగ్రెసు పార్టీ ఏమీ చేయలేకపోతోందని ఆయన అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ చరిత్రహీనులని ఆయన అన్నారు. రెండు నెలల్లో తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శానససభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారని ఆయన అన్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్సించారు. పార్టీ మారే వారిని సమర్థిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్ చార్జీలు, భూముల రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తాను సోనియాకు చెప్పినట్లు ఆయన తెలిపారు. తమ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తెలంగాణవారు కాదని, ఆంధ్రవారని ఆయన వ్యాఖ్యానించారు.