కోత, వాత: వైయస్ విజయమ్మ ఆధ్వర్యంలో దీక్ష
దీనికి కోత, వాతలపై నిరవధిక దీక్ష అని ఉప శీర్షిక కూడా పెట్టారు. విద్యుత్పై తమ దీక్షకు అందరూ సహకరించాలని పార్టీ నేత కొణతాల రామకృష్ణ కోరారు. విద్యుత్ సమస్యపై 3న ధర్నాలు, 5 నుంచి 14 వరకు ప్రజా బ్యాలెట్, 9న రాష్ట్ర బంద్ యథావిధిగా సాగుతాయని తెలిపారు. అన్ని పార్టీలూ ఆందోళనకు దిగిన తర్వాత ఆఖరున దీక్షకు నిర్ణయించడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్లుగా సమాచారం. అదే దారిలో కాకుండా మరో రూపంలో శ్రీకారం చుట్టి ఉంటే బాగుండేదని కొందరు అంటున్నట్లుగా తెలుస్తోంది.
బిజెపి దీక్షకు సంఘీభావం
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభంపై బిజెపి ఎమ్మెల్యేలు చేపట్టిన పోరు దీక్షకు విపక్షాలు, ప్రజా సంఘాల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతోంది. ఈ మేరకు దీక్షలో ఉన్న పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డిలను పలువురు నాయకులు సోమవారం పరామర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో విద్యుత్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
దీక్షలకు సర్కారు దిగిరాదని, పార్టీలకు అతీతంగా దీర్ఘకాలిక పోరాటం అవశ్యమని సూచించారు. ఇటు ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచితే, అటు ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్లు కాంగ్రెస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ డ్రామాలను కట్టిపెట్టాలని వారిని హెచ్చరించారు. మూడు దశాబ్దాలుగా ఇలాంటి దుస్థితి ఎన్నడూ లేదని, పొలాలు ఎండిపోతున్నాయని పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్రెడ్డి పేర్కొన్నారు.
విద్యుత్ సమస్యకు ఈ ప్రభుత్వమే కారణమని విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. చార్జీల పెంపు పై పోరాటంలో అన్ని పార్టీలూ కమ్ముకోవాలని టిడిపి ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి సూచించారు. ఈ నెల 9న తలపెట్టిన బంద్కు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ప్రకటించారు. మరోవైపు దీక్షలో ఉన్న ఎమ్మెల్యేలకు డాక్టర్లు వైద్య పరీక్ష నిర్వహించారు. వారికి చక్కెర స్థాయి, రక్తపోటు తగ్గినట్లు వెల్లడించారు.