లోపాలే రాస్తే ఎలా: మీడియాకు కిరణ్ రెడ్డి క్లాస్
నెల్లూరు హైదారాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియా ప్రతినిధులకు క్లాస్ తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత ఆయన బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు స్పందిస్తూ మీడియాకు క్లాస్ తీసుకున్నారు.
ప్రభుత్వం బాగా చేస్తోందని రాస్తూ లోపాలు ఎత్తి చూపితే బాగుంటుందని ఆయన అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందని చెప్పడానికి బియ్యం ధరలే నిదర్శనమని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం గురించి ఆలోచన చేస్తామని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లాలో ఆయన బుధవారం మన బియ్యం పథకాన్ని ప్రారంభించారు.
ఇదిలావుంటే, విద్యుత్ చార్జీల పెంపుపై ఆయన రేపు గురువారం హైదరాబాదులో మంత్రులతో సమీక్ష జరపనున్నారు. విద్యుత్తుపై ప్రజలకు వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని ఆయన మంత్రులకు సూచించే అవకాశం ఉంది. విద్యుత్తు ప్లాంట్లపై ఏర్పాటుపై ప్రతిపక్షాలు అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని కూడా ప్రజల ముందు పెట్టాలని ఆయన ఆలోచన చేస్తున్నారు. విద్యుత్ చార్జీలను తగ్గిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు.
కాగా, సామాన్యులను దృష్టిలో పెట్టుకుని విద్యుత్తు చార్జీల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు పి. శంకరరావు కోరారు. కేంద్రం కూడా రాష్ట్రానికి అదనపు విద్యుత్తు, గ్యాస్ ఇచ్చి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు కష్టకాలంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు అండగా నిలిచారని, రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రం ఆదుకోవాలని ఆయన అన్నారు.
విపక్షాల దీక్షలో ప్రజల కన్నా నాయకులే ఎక్కువగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా హ్యాట్రిక్ సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు మూడో సారి అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. పార్టీలో ఒకరికి ఒకే పదవి అనే విధానం స్వాగతించదగిందని శంకరరావు అన్నారు.