వేధింపులతో ఆత్మహత్యాయత్నం: హెలికాప్టర్పై ఫైరింగ్
హెలికాప్టర్ పైన మావోల కాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీసు స్టేషన్ పరిధిలో కిందకు దిగుతున్న ఓ హెలికాప్టర్ పైన మావోయిస్టులు కాల్పులు జరిపారు. పామేడు పరిసరాల్లో నక్సలైట్లు పేలుడు జరిపినట్లుగా తెలుస్తోంది. దీంతో అదనపు బలగాలు అక్కడకు హెలికాప్టర్లో చేరుకున్నాయి. ఈ సమయంలో మావోలు హెలికాప్టర్ పైన కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు.
విశాఖలో అగ్ని ప్రమాదం
విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం పెదనందపల్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది ఎకరాల చెరుకు తోట, 20 పశువుల పాకలు, 40 గడ్డివాములు తగులబడ్డాయి. ఈదురు గాలుల వల్ల మంటలు అదుపులోకి రావడం కష్టంగా మారింది.
చిట్టీల పేరుతో టోకరా
హైదరాబాదులో చిట్టీల పేరుతో ఓ వ్యక్తి రూ.3 కోట్ల మేర మోసానికి పాల్పడ్డాడు. నాచారం బాబా నగర్ ప్రాంతంలో నివసించే ఖలీల్ బాషా స్థానికంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పలువురి నుండి చిట్టీల పేరుతో కోట్లు వసూలు చేశాడు. వసూలు చేసిన వాటితో రాత్రికి రాత్రి ఉడాయించాడు. పోలీసులను బాధితులు ఆశ్రయించారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
విశాఖలో మావోల పోస్టర్లు
విశాఖలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునిచ్చారు. వారు ఏజెన్సీ ప్రాంతంలో పోస్టర్లు అంటించారు. మావోల పోస్టర్లతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.