స్టీరింగ్ పట్టిన కనుమూరి బాపిరాజు: మంత్రి సర్వే నవ్వు
ఈ సందర్భంగా కనుమూరి బాపిరాజు ఆ బస్సును తాను నడుపుతానంటూ డ్రైవరు సీటులో కూర్చుని స్టీరింగ్ వీల్ చేతిలోకి తీసుకున్నారు. బాపిరాజు స్టీరింగ్ తీసుకోగానే మంత్రి సర్వే సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ వాణి మోహన్, ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, బంగారు ఉషారాణి తదితరులు నవ్వారు. అయితే, బాపిరాజు మాత్రం జాగ్రత్తగా వంతెన కింద నుంచి పైవరకూ బస్సు నడిపారు.
కాగా అంతకుముందు కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణకు పశ్చిమ గోదావరి జిల్లాలో చేదు అనుభవం ఎదురయింది. కొద్ది రోజుల క్రితం ఆయన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వైయస్ కుక్క కన్నా హీనంగా చనిపోయాడని సర్వే అన్నారు. ఆ తర్వాత అతను తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు. అయితే, ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ భీమవరంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైయస్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సర్వే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత సర్వే క్షమాపణలు చెప్పారు. మరోవైపు సర్వే మాట్లాడుతూ.. తెలంగాణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. హైదరాబాదులో దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు ఉన్నప్పుడు సీమాంధ్ర ప్రజలు ఉంటే తప్పేమిటన్నారు. జగన్ ఆస్తులు సేకరిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యలు తీరుతాయన్నారు. ముఖ్యమంత్రి కావాలనే ఆశతోనే జగన్ పార్టీ స్థాపించారని, కాంగ్రెసులో ఉంటే జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు.