వైయస్ జగన్ పార్టీలోకి కోమటిరెడ్డి బ్రదర్స్: పాల్వాయి
కోమటిరెడ్డి బ్రదర్స్ను పార్టీ నుంచి బయటకు పంపితే కాంగ్రెస్ బాగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి సోదరులను లక్ష్యంగా చేసుకుని బుధవారం భువనగిరిలో నల్లగొండ జిల్లా స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ను కోమటిరెడ్డి బ్రదర్స్ భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. జగన్ పార్టీలోకి వెళ్లేందుకు చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నల్లగొండ జిల్లాకు కోమటిరెడ్డి బ్రదర్స్ దయ్యం పట్టిందని, ఆ దయ్యాన్ని వదిలించాల్సి ఉందని ఆయన అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రులు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయం తెలిసినా, కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేకపోతుందని పాల్వాయి అన్నారు. మే నెల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఏర్పాటై తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇంటిదొంగ అంటే కోమలిరెడ్డి బ్రదర్స్ భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని మరో నేత భిక్షమయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో దామోదర్రెడ్డి పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో రంగారెడ్డి, వరంగల్, నల్లొండ జిల్లాలోని ప్రాంతాలున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్కు వ్యతిరేకంగా ఈ నియోజకవర్గంలోని నేతలంతా ఒక్కటయ్యారు.