కన్నడనాట ఊరట ఎవరికో? ఊరడింపెవరికో? (పిక్చర్స్)
బెంగళూరు: 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్నాటకలో బిజెపి, కాంగ్రెసు, జెడి(ఎస్), కర్నాటక జనతా పార్టీ(కెజెపి) పార్టీలు తమ తమ భవితవ్యాన్ని మరో నెల రోజుల్లో తేల్చుకోనున్నాయి. కర్నాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి మాజీ ముఖ్యమంత్రి, కెజెపి అధ్యక్షుడు యడ్యూరప్ప, బిఎస్సార్ పార్టీ చీఫ్ శ్రీరాములు నుండి ఇబ్బందులు తప్పేలా లేవు. బిజెపి ఓట్లను వారు భారీగా చీల్చే అవకాశాలు ఉన్నాయి.
అదే జరిగితే ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి మరోసారి అధికారంలోకి రావడం కష్టమే. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో బిజెపికి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. స్థానికంలో కాంగ్రెసు పార్టీ తన సత్తా చాటింది. సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెసు సత్తా చాటడంతో అదే పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని అందరూ భావిస్తున్నారు. జెడి(ఎస్) కూడా స్థానికంలో సత్తా చాటింది. అదే సమయంలో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది.
మరోవైపు ఎన్నికల నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు యడ్యూరప్ప వైపుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బిజెపి కొత్త అభ్యర్థులను వెతుక్కోవాల్సిందే. కర్నాటక ఎన్నికల్లో ఆయా పార్టీల నుండి హేమాహేమీలైన నేతలు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. మే 5న ఎన్నికలు జరుగుతాయి. 8న ఫలితాలు వస్తాయి.
జగదీష్ శెట్టార్ బిజెపి సీనియర్ నేత, ముఖ్యమంత్రి జగదీష్ శెట్టార్ సంక్షోభ సమయంలో సిఎం అయ్యారు. ఓ వైపు ఎమ్మెల్యేలు యడ్డీ వైపు చూస్తున్నారు. మరోవైపు స్థానికంలో ఎదురు దెబ్బ తగిలింది. ఇలాంటి సమయంలో జగదీష్ శెట్టార్ నెట్టుకు రావడం కాస్త కష్టమే అంటున్నారు. శెట్టార్ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పలా ప్రజల్లో చరిష్మా గల నేత కాదు.
బిజెపి అధిష్టానం తనను తిరిగి ముఖ్యమంత్రిగా చేయక పోవడంతో అలకవహించిన యడ్యూరప్ప ఓ నేత స్థాపించిన కెజెపిలో చేరి అధ్యక్షుడయ్యారు. యడ్డీకి ఉన్న చరిష్మా, ఆయన సామాజికవర్గం(లింగాయత్) నుండి ఆయనకు మద్దతున్న నేపథ్యంలో పలువురు ఆయన వైపుకు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టయ్యాక ఆయన అనుచరుడు శ్రీరాములు బిజెపిని వీడి కొత్త పార్టీ పెట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. బళ్లారి తదితర ప్రాంతంలో ఆయన ఎఫెక్ట్ బిజెపిపై పడనుంది.
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు దక్షిణ కర్నాటకలో మంచి పట్టు ఉంది. అదే విధంగా ఎస్సీ, బిసిలలో పట్టు ఉంది.
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్యకు మైసూర్ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు గెలిస్తే ముఖ్యమంత్రి రేసులో ఉంటారు.
జెడి(ఎస్) నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామికి ఓ సామాజికవర్గం అండ ఉంది. పాత మైసూరులో ఈయనకు మంచి పట్టు ఉంది. బిసిలు, మైనార్టీల మద్దతు ఉంది.