జగన్, వైయస్లపై దుమ్మెత్తిపోసిన బాబు, గెలవాల్సిందే
మనలో ఉన్న పట్టుదలకు కసి తోడవ్వాలని, వచ్చే ఎన్నికల్లో టిడిపి కచ్చితంగా గెలిచి తీరాలని, మీరంతా కష్టాల్లో ఉన్నారని, అధికారంలో లేకపోయినా తొమ్మిదేళ్లుగా జెండాలు మోస్తున్నారని, ఇంకా ఎన్నాళ్లని మోస్తూ కూర్చుంటామని, అధికారం వస్తేనే ప్రజలకు న్యాయం చేయగలమని చంద్రబాబు అన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు ఇప్పిస్తామని బాబు హామీ ఇచ్చారు.
బెల్టుషాపులను ఎత్తివేయించి వారికి వేరే ఉపాధి కల్పిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు ఏడాదిలోనైనా లేక ఆరు నెలల్లోనైనా రావొచ్చునన్నారు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటులకు సైకిల్ దూసుకుపోవాలన్నారు. జెండాలు మోసీమోసీ భుజాలు అరిగిపోయాయని, ఇక అధికారంలోకి రావడం తప్పనిసరన్నారు.
సమర్థంగా పని చేయాలనుకున్నప్పుడు మొహమాటాలకు తావుండవద్దన్నారు. విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి వైయస్, కాంగ్రెస్ బృందం రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని, వైయస్, జగన్ అక్రమాలవల్ల రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. నీకది.. నాకిది పద్ధతిలో వెనకేసిన సొమ్ముతో జగన్ పత్రిక, టీవీలను పెట్టారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తండ్రీ, కొడుకూ దారుణంగా సిగ్గులేకుండా దోచుకున్నారన్నారు.
జగన్ తనకు రూ.10 కోట్లిస్తే.. రూ.100 కోట్ల లబ్ధి చేకూరుస్తానంటూ.. తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్ర ఖజానాకు రూ.10 లక్షల కోట్లు చిల్లు పెట్టారన్నారు. కాశీకి వెళ్లిన వాళ్లు తమకు ఇష్టమైనవి వదిలేస్తారని, వైయస్ సిగ్గు, శరం వదిలేశారని చంద్రబాబు ఎద్దేవాచేశారు. కార్యకర్తలపై కేసులు, కోర్టు వ్యవహారాల వంటి అంశాల్లో పార్టీ వారికి అండగా ఉంటుందని, ఎంత ఖర్చయినా భరిస్తుందని భరోసా ఇచ్చారు.