ముషార్రఫ్కు షాక్: నామినేషన్ పత్రాల తిరస్కరణ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ రాజకీయ ఆకాంక్షకు ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్లో మే 11వ తేదీన జరిగే ఎన్నికల కోసం నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ముషార్రఫ్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా, ఓ నియోజకవర్గంలో ఆయన నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి.
కరాచీ, ఇస్లామాబాద్, చిత్రాలు, కసూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ముషార్రఫ్ నామినేషన్లు దాఖలు చేశారు. పంజాబ్ ప్రొవిన్స్లోని కసూరు సీటుకు దాఖలు చేసిన పత్రాలను రిటర్నింగ్ అధికారి మొహమ్మద సలీం తిరస్కరించారు. ఏ కారణాలతో వాటిని తిరస్కరించారనేది స్పష్టంగా లేదు. ముషార్రఫ్ సంతకం జాతీయ గుర్తింపు కార్డుపై ఉన్న సంతకంతో సరిపోలడం లేదనేది ఒక కారణంగా చెబుతున్నారు
ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను మరో కారణంగా చూపిస్తున్నారు. ముషార్రఫ్ రాజ్యాంగంలోని 62, 63 ఆర్టికల్స్ను ఉల్లంఘించారని న్యాయవాది అభ్యంతరపెట్టినట్లు సమాచారం. ఇస్లామాబాద్లో కూడా ఓ వ్యక్తి ముషార్రఫ్ నామినేషన్ పత్రాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు.
నాలుగు కేసుల్లో నిందితుడైన ముషార్రఫ్ను ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హుడిగా ప్రకటించాలని పిఎంఎల్ - ఎన్ తరఫున జఫరుల్లా అనే న్యాయవాది ఎన్నికల కమిషన్ను కోరారు. బెనజీర్ భుట్టో హత్య కేసును, 2006 సైనిక చర్యలో బలోచి నేత అక్బర్ భుక్తిని చంపిన కేసు ఇందులో ఉన్నాయి.
రాజద్రోహం కేసులో ముషార్రఫ్ను విచారించాలని కోరుతూ రావల్పిండి హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తాఫిక్ ఆసిఫ్ దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తెకార్ చౌధురితో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ సోమవారం విచారణ చేపట్టనుంది.