అర్ధరాత్రి దీక్ష భగ్నం: విరమించిన వైయస్ విజయమ్మ
రెండు రోజులుగా దీక్షను భగ్నం చేస్తారని ప్రచారం జరగడంతో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో, పోలీసులు వెనక్కి తగ్గారు. శనివారం రాత్రి పక్కా వ్యూహంతో దీక్షను భగ్నం చేశారు. పార్టీ విజయమ్మతో పాటు శోభా నాగిరెడ్డిని దీక్షా ప్రాంగణం వెనక వైపు నుంచి అంబులెన్స్లోకి ఎక్కించారు. మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వివిధ ఆస్పత్రులకు చెందిన అంబులెన్స్ల్లో నిమ్స్కు తరలించారు.
ఈ సందర్భంగా కొద్దిసేపు తోపులాట జరిగింది. శోభా నాగిరెడ్డితోపాటు మరికొందరు మహిళలు కదిలే ప్రసక్తి లేదని బైఠాయించినా చివరకు భారీ బందోబస్తు మధ్య అంబులెన్స్ల్లోకి ఎక్కించారు. వారిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి వారిని తరలించారు. అనంతరం ఈ రోజు ఉదయం జర్నలిస్టు పొత్తూరు వెంకటేశ్వర రావు, రైల్వే కోడూరుకు చెందిన ఓ రైతు విజయమ్మకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ... దీక్షను విరమించినా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగి వచ్చి విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. కాగా, గోపాలపురం ఎమ్మెల్యే వనిత ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం రాత్రి ఆమెను మెడిసిటీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.