కరిష్మా వ్యవహారం, ఐశ్వర్య గర్భం...: మీడియాపై కట్జూ
కులమతాలు చూసి దేశంలోని 90 శాతం ప్రజలు ఓట్లేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 90 శాతం మంది ప్రజలు అవివేకులన్నారు. ఎనభై శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారని, ప్రజల మూఢ విశ్వాసాలు, వెనుకబాటుతనం వల్లే దేశం అభివృద్ధి చెందడం లేదన్నారు. ఓటర్లలో తొంభై శాతం మంది పోటీ చేసే వారి కులం, మతాన్ని చూసి ఓట్లేస్తున్నారన్నారు.
మీడియా సినీ తారాలకే ప్రాధాన్యం ఇస్తోందని, సామాన్య ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరిష్మా కపూర్ ఎవరితో వ్యవహారం నడుపుతోంది.. ఐశఅవర్య రాయ్ గర్భధారణ వంటి సినీ తారల వ్యవహారాలే నేడు మీడియాకు పెద్ద వార్తలుగా మారుతున్నాయన్నారు.
"మీడియా వ్యాపార వస్తువయింది. డబ్బుకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. టీఆర్పీ రేటింగ్స్ కోసమే ప్రయత్నిస్తున్నాయి. సినిమావాళ్లు.. కరీనా కపూర్కు ఎవరితోనో అఫైర్ ఉందంటే అదేదో గొప్ప అంశంగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐశ్వర్యారాయ్ బచ్చన్ గర్భవతి అయిందంటే తెగ ప్రచారం చేస్తున్నారు. పాకిస్థాన్పై భారత్ క్రికెట్లో గెలిస్తే విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవే ముఖ్యాంశాలా? పేదరికం, నిరుద్యోగం, ఆకలి, దారిద్య్రం, పౌష్టికాహార లోపంతో పసిపిల్లల మరణాలు, రైతుల ఆత్మహత్యలు, పెరిగే ధరలు ముఖ్యమైన అంశాలు కావా? వాటికి ఎందుకు మీడియా ప్రాధాన్యం ఇవ్వడం లేదు?'' అని జస్టిస్ కట్జూ ప్రశ్నించారు.
కాగా, తెలంగాణ డిమాండ్ న్యాయమైంది కాదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అంతకుముందు అన్న విషయం తెలిసిందే. అది సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాను వ్యతిరేకమని స్పష్టంచేశారు. దక్షిణాది మీడియా సంబంధిత కేసుల విచారణ కోసం హైదరాబాద్ వచ్చిన జస్టిస్ కట్జూ మీడియాతో మాట్లాడారు.